బీజేపీ నేతలు మోకాళ్ళ మీద నడిచినా అధికారం దక్కదు

బీజేపీ నేతలు మోకాళ్ళ మీద నడిచినా అధికారం దక్కదు

హుజూరా బాద్ లో దొంగలు పడ్డ ఆరునెలలకు కుక్క మొరిగినట్టు నిజామాబాద్ ఎంపీ అరవింద్ మొరిగాడని పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి అన్నారు. దళిత బంధు మీటింగ్ 16న జరిగితే అరవింద్ ఇపుడు మాట్లాడుతున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ అంటే బిగ్ జోకర్స్ పార్టీగా మారిందని.. ఆ పార్టీలో బిగ్ లోఫర్ అరవింద్ అని జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈ రోజు టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పై కామెంట్స్ చేశారు. 

‘పసువు బోర్డు తెస్తానని ఫేక్ బాండ్ పేపర్ రాసి ఇచ్చిన ఫేక్ ఎంపీ అరవింద్. అలాంటి అరవింద్ కు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితల గురించి మాట్లాడే స్థాయి ఉందా? మిషన్ భగీరథ ప్రపంచం మెచ్చిన పథకం. కేంద్ర మంత్రి షెకావత్ ఈ పథకాన్ని పార్లమెంటు సాక్షిగా పొగిడింది అరవింద్ కు కనిపించదా? కరెంటు సరిగా ఇవ్వడం లేదని ఈ ఫేక్ ఎంపీ అబద్దాలు మాట్లాడుతున్నాడు. నాణ్యమైన కరెంటు ఇస్తుందని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం పొగడలేదా? తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొడుతోంది. మంచి పథకాలు కాకపోతే.. కేంద్రం వాటిని ఎందుకు అమలు చేస్తుంది. కేసీఆర్ సరిగా పాలించకపోతే.. తెలంగాణ ప్రజలు అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎందుకు ఓట్లేస్తున్నారు?
 తెలంగాణ ప్రభుత్వం తన పథకాలకు స్వయంగా నిధులు సమకూర్చుకుంటోంది. కేంద్రం వాటా నయా పైసా లేదు. బీజేపీ నేతలు మాటి మాటికి కేసీఆర్ ను జైలుకు పంపుతామనే ప్రగల్భాలు బంద్ చేయాలి. 

బీజేపీ నేతలు ఎన్ని పాదయాత్రలు చేసినా, మోకాళ్ళ మీద నడిచినా తెలంగాణలో ఆ పార్టీకి అధికారం కలే. ఉద్యమం నుంచి వచ్చి నేతలుగా నిరూపించుకున్న కేటీఆర్, హరీష్ రావు, కవితలను వారసత్వ రాజకీయాలకు ప్రతినిధులంటే తెలంగాణ సమాజం హర్షించదు. కేంద్ర ప్రభుత్వాన్ని గుజరాత్ ముఠాతో నింపిన మోడీ పార్టీలో ఉంటూ అరవింద్ తెలంగాణలో సామాజిక న్యాయం గురించి మాట్లాడటమా?’ అని జీవన్ రెడ్డి అన్నారు.