
పుణెకు చెందిన షర్మిస్తా పనోలి అనే లా స్టూడెంట్ను కోల్కత్తా పోలీసులు అరెస్ట్ చేశారు. గురుగ్రాంలో ఉంటున్న ఈ యువతిని పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. ‘ఆపరేషన్ సింధూర్’పై స్పందిస్తూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఆమెను అరెస్ట్ చేయడం గమనార్హం. ఆమె వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను కూడా డిలీట్ చేశారు. ఒక మతాన్ని టార్గెట్ చేసే విధంగా ఆమె చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఆమె తన ఇన్ స్టాగ్రాంలో ఈ వీడియో అప్ లోడ్ చేసింది.
ఈ క్లిప్ వైరల్ కావడంతో కోల్కత్తా పోలీస్ స్టేషన్లో ఆమెపై ఫిర్యాదు నమోదైంది. ఫిర్యాదు ఆధారంగా కోల్కత్తా పోలీసులు షర్మిస్తాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే తాను చేసిన వ్యాఖ్యలపై, పెట్టిన పోస్టులపై అదే సోషల్ మీడియా వేదికగా ఆమె క్షమాపణలు కోరింది. ఆమెకు లీగల్ నోటీసులను పలుమార్లు పంపినప్పటికీ ఆమె, ఆమె కుటుంబం అదృశ్యమై ఆ నోటీసులపై స్పందించలేదు. దీంతో.. ఇక లాభం లేదని భావించిన పోలీసులు కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో పోలీసులు ఆమెను గురుగ్రాంలో అరెస్ట్ చేశారు.
ఇక.. ఆమె వ్యాఖ్యల పూర్వాపరాల్లోకి వెళితే.. పనోలి ఒక వీడియోను మే 14, 2025న తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోపై ఒక పాకిస్తాన్ ఫాలోవర్ స్పందిస్తూ.. పహల్గాం ఘటన తర్వాత భారత సైన్యం చర్యలపై ఆమెను ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు స్పందిస్తూ.. ఆమె ఇస్లాం మతంపై, PBUHపై తీవ్రంగా స్పందిస్తూ మతాన్ని కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.
►ALSO READ | India Covid Cases Rise: కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నయ్.. 3 వేలకు చేరువలో యాక్టివ్ కేసులు
ఆమె వ్యాఖ్యలపై ముస్లింలు భగ్గుమన్నారు. #ArrestSharmishta అనే హ్యాష్ ట్యాగ్ ‘ఎక్స్’లో ట్రెండ్ అయింది. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేశారు. రాడికల్ పాకిస్తానీ టెర్రరిస్ట్ గ్రూప్ నుంచి చంపేస్తామని బెదిరింపులు కూడా వచ్చాయి. మే 31న పనోలిని కోల్కత్తా కోర్టులో హాజరుపర్చనున్నారు. ఆమె అరెస్ట్ అన్యాయంగా జరిగిందని, అనైతికమని, ఆమెను తక్షణమే విడుదల చేయాలని కూడా సోషల్ మీడియలో #ReleaseSharmistha హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవడం గమనార్హం.