పెట్రోల్‌ కూడా డోర్‌ డెలివరీ

పెట్రోల్‌ కూడా డోర్‌ డెలివరీ

న్యూఢిల్లీ: ఇది వరకే కొన్ని నగరాల్లో డీజిల్‌ను డోర్‌ డెలివరీ చేస్తున్న ఇండియన్‌ ఆయిల్ కార్పొరేషన్‌ (ఐఓసీ), భారత్‌ పెట్రోలియం (బీపీ), హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) మరో 20 నగరాలకు ఈ సేవలను అందించాలని నిర్ణయించాయి.  మూడు నెలల్లోపు పెట్రోల్‌ను కూడా డోర్‌ డెలివరీ చేపడతామని ప్రకటించాయి. డోర్‌ డెలివరీ సేవలకు మంచి స్పందన వచ్చిందని, దీనివల్ల సురక్షితంగా ఇంధనాన్ని అందించవచ్చని హెచ్‌పీసీఎల్‌ సీఎండీ ఎంకే సురానా అన్నారు.

ప్రస్తుతం 35 నగరాల్లో డీజిల్‌ డోర్‌ డెలివరీ ఉంది. 2,500 లీటర్ల కంటే ఎక్కువ మొత్తంలో డీజిల్‌ కొనేవారికి మాత్రమే ఈ సదుపాయం అందిస్తున్నారు. 2030 నాటికి పెట్రోల్‌కు డిమాండ్‌ 49 మిలియన్‌ టన్నులకు చేరుతుందని అంచనా. దీంతో ఆయిల్‌ కంపెనీలు దేశవ్యాప్తంగా మరో 78,500 ఔట్‌లెట్లను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి.