హైదరాబాద్ : భారత విదేశాంగ విధానంపై మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చెరగని ముద్ర వేశారన్నారు మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. పీవీ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా టీపీసీసీ ఏర్పాటు చేసిన ఇండియన్ ఫారిన్ పాలసీ అండ్ పీవీ నరసింహారావ అనే వెబ్ నార్లో శశిథరూర్ పాల్గొని మాట్లాడారు. ఆర్థికంగా ప్రపంచ దేశాలకు పీవీ ఒక రోల్ మోడల్ అని.. తప్పకుండా పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్నఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో పీవీ నైపుణ్యంతో అమలు చేసిన విధానాలు దేశ భవిష్యత్ అభ్యున్నతికి దోహదపడ్డాయన్నారు. ఆర్థిక సంస్కరణలు, ప్రపంచ దేశాల మధ్య పొత్తులు, దేశ విదేశాంగ విధానంపై ఆయన చెరగని ముద్ర వేశారని తెలిపారు శశి థరూర్.
హృదయపూర్వక సంస్కరణవాది పీవీ అన్న ఆయన.. భారత రాజకీయ చరిత్రలో అత్యున్నత దక్షిణ భారతీయులలో ఒకరు పీవీ అన్నారు. విశేష లక్షణాలను కలిగిఉండి భారతదేశాన్ని నిజంగా గర్వించేలా చేసిన వ్యక్తి అని.. భాషలపై అతని పట్టు, పొత్తుల అంశంలో చూపిన నైపుణ్యం, అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ తో ధైర్యంగా ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టించి భారతదేశాన్ని ప్రాథమికంగా మార్పు వైపు పయనింపజేశారన్నారు. ఆయన వినయం భారత నీతిని, దేశ పురోగతి కోరికను బలపరిచిందన్నారు శశి థరూర్.