
- పనులు మొదలు పెట్టి ఆ తర్వాత పట్టించుకోని బీఆర్ఎస్
- మంత్రి పొన్నం చొరవతో చివరి దశకు చేరుకున్న పనులు
- మైనర్ రిపేర్లు కూడా మరో 15 రోజుల్లో పూర్తి చేయాలని నిర్ణయం
- జయంతి నాటికి అందుబాటులోకి తెచ్చేలా ప్లాన్
హనుమకొండ/భీమదేవరపల్లి, వెలుగు : భారతరత్న, దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరున ఆయన స్వగ్రామం హనుమకొండ జిల్లా వంగరలో నిర్మిస్తున్న విజ్ఞాన కేంద్రం పనులు చివరి దశకు చేరుకున్నాయి. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పనులు స్లోగా జరుగగా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పనుల్లో స్పీడ్ పెరిగింది. పెండింగ్లో ఉన్న మైనర్ వర్క్స్ను రెండు వారాల్లో పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఈ నెల 28న వంగరలో నిర్వహించనున్న పీవీ 104వ జయంతి సందర్భంగా పీవీ విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మొదటి దశలో విజ్ఞాన కేంద్రం పూర్తి చేసి, రెండో దశలో మిగతా పనులు చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు.
హామీలిచ్చి వదిలేసిన బీఆర్ఎస్
దేశాన్ని సంస్కరణల దిశగా నడిపించి, అభివృద్ధి బాటపట్టించిన పీవీ.నరసింహరావు వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో 1921 జూన్ 28న పుట్టారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరకు చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మ దంపతులు దత్తత తీసుకోవడంతో ఆయన వంగరలోనే పెరిగారు. రాష్ట్ర మంత్రిగా, సీఎంగా, ప్రధానిగా సేవలు అందించిన నరసింహారావు 2004 డిసెంబర్ 23న మరణించారు. 2020 జూన్ 28 నుంచి 2021 జూన్ 28 వరకు పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు గత సర్కార్ ప్లాన్ చేసింది.
ఈ సందర్భంగా పీవీ పుట్టి పెరిగిన లక్నేపల్లి, వంగరను టూరిజం స్పాట్లుగా డెవలప్ చేస్తామని అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటించారు. వంగరతో పాటు వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, ఢిల్లీలో పీవీ విగ్రహాలు పెడతామని హామీ ఇచ్చారు. అమెరికా, బ్రిటన్, సౌతాఫ్రికా, మలేషియా, మారిషస్లో కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. పీవీ శతజయంతి ఉత్సవాల కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసి, వివిధ కార్యక్రమాల పేరుతో హడావుడి చేశారు. కానీ నెక్లెస్ రోడ్డు పేరును పీవీ.నర్సింహారావు మార్గ్గా మార్చడం, పీవీ జీవిత చరిత్రకు సంబంధించిన తొమ్మిది పుస్తకాలను ప్రచురించడం మినహా మిగతా హామీలను గత ప్రభుత్వం పట్టించుకోలేదు.
ఎట్టకేలకు చివరి దశకు చేరిన పనులు
గత ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వంగరలో పీవీ విజ్ఞాన కేంద్రం నిర్మించేందుకు టూరిజం ఆఫీసర్లు కసరత్తు చేశారు. రూ.11 కోట్లతో వివిధ ప్రపోజల్స్ రెడీ చేశారు. ఇందులో నాలుగు ఎకరాల స్థలంలో రూ.7 కోట్లతో ఆడిటోరియం, సైన్స్ మ్యూజియం, గ్యాలరీ, సెమినార్ హాల్, మెడిటేషన్ సెంటర్ నిర్మాణానికి ప్లాన్ చేశారు. గతంలోనే మొదలైన ఈ పనులు.. అప్పటి లీడర్లు పట్టించుకోకపోవడం, నిధులు కూడా విడుదల చేయకపోవడంతో మూడేండ్ల పాటు నత్తనడకన కొనసాగాయి.
కాంగ్రెస్ గెలిచిన తర్వాత మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ పీవీ విజ్ఞాన కేంద్రం పనులను ఛాలెంజింగ్గా తీసుకున్నారు. ఇప్పటికే ఎల్కతుర్తి జంక్షన్ డెవలప్మెంట్పై స్పెషల్ ఫోకస్ పెట్టిన ఆయన.. వంగరను అభివృద్ధి చేయడంతో పాటు విజ్ఞాన కేంద్రం పనులను స్పీడప్ చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఎప్పటికప్పుడు కలెక్టర్, టూరిజం ఆఫీసర్లకు సూచనలు ఇచ్చారు. ఏడాదిలోనే పనులకు తుది రూపు తీసుకొచ్చారు.
మరికొన్ని ప్రతిపాదనలు
పీవీ గ్రామాల డెవలప్మెంట్లో భాగంగా లక్నేపల్లిలో కల్చరల్ సెంటర్, ఎల్కతుర్తి- – సిద్దిపేట హైవేపై వంగర క్రాస్ వద్ద ఆర్చి, గ్రామానికి డబుల్ రోడ్డు, రెండు వైపులా బ్యూటిఫికేషన్, మినీ ట్యాంక్బండ్గా వంగర చెరువు, కైలాసనాథ ఆలయ అభివృద్ధి.. ఇలా వివిధ పనులకు గతంలోనే ప్రపోజల్స్ తయారు చేశారు. కానీ నిధుల కొరత వల్ల ఇన్నాళ్లు ఈ పనులు కాగితాలకే పరిమితం అయ్యాయని, త్వరలోనే వీటికి మోక్షం కలగనుందని అధికారులు చెబుతున్నారు. అవి కూడా పూర్తయితే పీవీ స్వగ్రామం వంగర టూరిస్ట్ స్పాట్గా మారనుందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పీవీ జయంతి రోజునే ఓపెనింగ్
వంగరలోని పీవీ ఇంటిని ఇప్పటికే మ్యూజియంగా మార్చి ఆయన వినియోగించిన వస్తువులను అందులో భద్రపరిచారు. ఇక పీవీ విజ్ఞాన కేంద్రంలో సైన్స్ మ్యూజియం బిల్డింగ్ పనులు పూర్తయ్యాయి. ఇందులో వివిధ రకాల ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయాల్సి ఉంది. పీవీ పుస్తకాలు, ఫొటోలతో గ్యాలరీ పనులు కూడా మొదలయ్యాయి. ఆడిటోరియం, సెమినార్ హాల్, మెడిటేషన్ సెంటర్, టాయిలెట్స్ పనులు పూర్తయ్యాయి. పెయింటింగ్, ఎలక్ట్రిఫికేషన్, గార్డెనింగ్ పనులు పెండింగ్లో ఉండగా... వాటిని రెండు వారాల్లోగా పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.
ఈ పనుల కోసం ఇటీవల కలెక్టర్ రూ.30 లక్షలు కేటాయించారు. దీంతో సంబంధిత కాంట్రాక్టర్ పనులను స్పీడప్ చేశారు. గ్రామంలో ఇప్పటికే పీవీ విగ్రహం ఉండగా.. దానిని ఒకటి రెండు రోజుల్లో విజ్ఞాన కేంద్రంలోకి తరలించనున్నారు. ఈ నెల 28న పీవీ 104వ జయంతి జరగనుండగా.. అదే రోజున విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మొదటి ఫేజ్లో పీవీ విజ్ఞాన కేంద్రం పనులు పూర్తి చేయగా.. సెకండ్ ఫేజ్లో రూ.4 కోట్లతో మహిళా శక్తి క్యాంటిన్, బ్యూటిఫికేషన్ తదితర పనులు చేపట్టనున్నట్లు టూరిజం ఆఫీసర్లు చెబుతున్నారు.