- నేటి నుంచి మలేసియా ఓపెన్
కౌలాలంపూర్: కొంతకాలంగా వరుస ఓటములతో నిరాశ పరుస్తున్న ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు మంగళవారం మొదలయ్యే మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్ 750 టోర్నమెంట్లో సత్తా చాటాలని ఆశిస్తోంది. ఇండోనేసియా ఓపెన్లో తొలి రౌండ్లో ఓడిన సింధు ఇక్కడ తన స్థాయికి తగ్గట్టు ఆడాలని కోరుకుంటోంది. విమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్లో సింధు.. థాయ్లాండ్కు చెందిన పొర్నపవీ చొచువాంగ్తో తలపడనుంది. తొలి రౌండ్ దాటితే రెండో రౌండ్లో ఒలింపిక్ చాంపియన్ చెన్ యుఫి (చైనా)తో సింధుకు అతిపెద్ద సవాల్ ఎదురవనుంది. మరో సీనియర్ షట్లర్ సైనా నెహ్వాల్.. మొదటి రౌండ్లో అమెరికా షట్లర్ ఐరిస్ వాంగ్తో తలపడుతుంది.
మెన్స్ సింగిల్స్లో నిలకడగా ఆడుతూ.. థామస్ కప్లో ఇండియా చారిత్రక విజయంలో భాగమైన ప్రణయ్ తొలి రౌండ్లో మలేసియా ప్లేయర్ డారెన్ లివ్తో పోటీ పడతాడు. తెలుగు షట్లర్ బి. సాయి ప్రణీత్కు తొలి రౌండ్లోనే ఆరో సీడ్ ఆంథోనీ గింటింగ్ (ఇండోనేసియా)తో, సమీర్ వర్మకు ఏడో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)తో ముప్పు ఉంది. డబుల్స్లో ఎనిమిదో ర్యాంకర్ సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ షెట్టిపై అంచనాలున్నాయి.