కొత్త జర్నీ కోసం వెయిట్ చేస్తున్నా: ఐపీఎల్‎కు స్టార్ స్పిన్నర్ అశ్విన్ గుడ్ బై

కొత్త జర్నీ కోసం వెయిట్ చేస్తున్నా: ఐపీఎల్‎కు స్టార్ స్పిన్నర్ అశ్విన్ గుడ్ బై

భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్‎కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని బుధవారం (ఆగస్ట్ 27) సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఇప్పటికే అన్ని ఫార్మాట్ల అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్‌మెంట్ ప్రకటించిన అశ్విన్.. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. లాస్ట్ సీజన్‎లో చెన్నై సూపర్ కింగ్స్ తరుఫున బరిలోకి దిగాడు ఈ స్టార్ ఆఫ్ స్పిన్నర్. గత సీజన్‎లో అంచనాల మేర రాణించలేకపోవడంతో సీఎస్కే వచ్చే సీజన్‎కు అశ్విన్‎ను వేలానికి వదిలేయనున్నట్లు గత  కొద్ది రోజులుగా క్రీడా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో అశ్విన్ ఐపీఎల్‎కు గుడ్ బై చెప్పడం గమనార్హం. 

‘‘ఇది ఒక ప్రత్యేకమైన రోజు. ఒక ప్రత్యేకమైన ప్రారంభం. ప్రతి ముగింపు కొత్త ప్రారంభంతో ఉంటుందని వారు అంటున్నారు. ఐపీఎల్ ప్లేయర్‎గా నా టైమ్ ఈరోజుతో ముగిసింది. కానీ వివిధ లీగ్‌ల్లో ఆటగాడిగా నా సమయం ఈరోజుతో ప్రారంభమైంది. ఇన్ని సంవత్సరాలు అద్భుతమైన జ్ఞాపకాలు అందించిన అన్ని ఫ్రాంచైజీలు, ఐపీఎల్, బీసీసీఐకి ధన్యవాదాలు. భవిష్యత్‎ను  ఆస్వాదించడానికి, సద్వినియోగం చేసుకోవడానికి ఎదురు చూస్తున్నా’’ అని రిటైర్మెంట్ ప్రకటనలో పేర్కొన్నాడు అశ్విన్. 

అశ్విన్ ఐపీఎల్‎లో 221 మ్యాచ్‌లు ఆడి 187 వికెట్లు పడగొట్టాడు. లీగ్‌లో మొత్తం ఐదు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. చెన్నై సూపర్ కింగ్స్, రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్‌ తరుఫున ఆడాడు. పంజాబ్‎కు కెప్టెన్‎గా కూడా పని చేశాడు ఈ దిగ్గజ బౌలర్. టోర్నమెంట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఐదవ బౌలర్‌గా అశ్విన్ రిటైర్ అయ్యాడు. 

యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, సునీల్ నరైన్, పియూష్ చావ్లా అశ్విన్ కంటే ముందున్నారు. 
 ఐపీఎల్ 2025లో తన హోమ్ టీమ్ చెన్నై తరుఫున బరిలోకి దిగాడు అశ్విన్. ఈ టోర్నీలో 9 మ్యాచ్‌లు ఆడి 7 వికెట్లు మాత్రమే పడగొట్టి 33 పరుగులు చేసి పూర్తి నిరాశపర్చాడు. అంచనాల మేర రాణించకపోవడం, సహచర బౌలర్ నూర్ అహ్మద్‌ను విమర్శించిన వివాదంతో జట్టులో స్థానం కోల్పోయాడు అశ్విన్.