
కళాశాల, పాఠశాల, గురుకుల విద్యార్థుల మెస్ చార్జీలను, స్కాలర్ షిప్ లను తక్షణమే పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. పెరిగిన నిత్యవసర ధరలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తక్షణమే స్కాలర్ షిప్ పెంచాలని పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ లో ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని 8 సంవత్సరాల అవుతున్న 6 సంవత్సరాల నుండి సమస్యల సాధన కోసం ఉద్యమాలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు.
హాస్టళ్లకు సొంత భవనాలు లేకపోవడం విడ్డూరమని ఆర్ కృష్ణయ్య అన్నారు. తమ వినతి మేరకు విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించినప్పటికీ కార్యాచరణలో పెట్టకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించాల్సిన ఐఏఎస్ అధికారులు విధులను మరచి భూ దందాలకు పాల్పడుతున్నారని తీవ్రంగా ఆరోపించారు. వీరిపై చర్యలు తీసుకునే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వినతి పత్రం అందిస్తామన్నారు. మెస్ చార్జీలను 3 వేలకు పెంచాలన్నారు. గతంలో విద్యార్థులకు ఇస్తున్న పాకెట్ మనీ విధంగానే అబ్బాయిలకు 500 అమ్మాయిలకు 1000 రూపాయలు ఇవ్వాలని కోరారు. లేదంటే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.