ఇన్నేండ్లు చేసిన తప్పులకు..ముక్కు నేలకు రాయాలి

ఇన్నేండ్లు చేసిన తప్పులకు..ముక్కు నేలకు రాయాలి
  • తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
  • ఇప్పుడు ఉద్యమకారులు గుర్తుకొచ్చిన్రా?
  • బీఆర్ఎస్​ను ప్రజలే బొందపెడ్తరని ధ్వజం

హైదరాబాద్, వెలుగు :  అధికారంలో ఉండి చేసిన తప్పులకు కేటీఆర్, హరీశ్ రావు అమరవీరుల స్మారక స్తూపం ఎదుట ముక్కు నేలకు రాయాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అమరుల కుటుంబాలు, ఉద్యమకారులకే ఎంపీ టికెట్లు ఇస్తామని ప్రమాణం చేయాలన్నారు.

మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీస్​లో రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. ‘‘బీఆర్ఎస్ లీడర్లు లోక్​సభ సమీక్షల పేరుతో రోజుకో కొత్త మాట చెప్తున్నరు. అధికారం కోల్పోయిన తర్వాత హరీశ్​కు ఉద్యమకారులు, కార్యకర్తలు గుర్తుకు వచ్చారా?. పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్లకు టికెట్లు ఇచ్చి నిజాయితీ నిరూపించుకోవాలి. శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మకు అన్యాయం చేశారు. ఆమెకు ఎంపీ టికెట్ ఇస్తామని ప్రకటించే దమ్ము, ధైర్యం మీకు ఉందా?’’అని రఘునందన్ రావు ఫైర్ అయ్యారు.

బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో ఖతమైంది

మెదక్, చేవెళ్ల, మహబూబ్ నగర్ ఎంపీ టికెట్లు ఇప్పటికే అమ్ముకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయని రఘునందన్ రావు అన్నారు. ‘‘కలెక్టర్లుగా పనిచేసి కేసీఆర్ కాళ్లు మొక్కినోళ్లకు.. ఎమ్మెల్సీలు అయినోళ్లకు.. బడా వ్యాపారవేత్తలకు సీట్లు అమ్ముకోవడం మానుకోవాలి. హరీశ్, కేటీఆర్ ఉద్యమకారులు, కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నరు.

అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రజలు బీఆర్ఎస్​ను బొందపెడ్తరు. బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెల్వదు. కేటీఆర్, హరీశ్ అహంకారం కారణంగానే బీఆర్ఎస్ ఓడిపోయింది’’అని విమర్శించారు. కవిత బీఆర్ఎస్ పార్టీలో ఉందో.. లేదో కూడా తెలీదన్నారు. బీజేపీని ఎవరూ ఖతం చేయలేరని, బీఆర్ఎస్ ఇప్పటికే ఖతం అయిందని విమర్శించారు.