- మెదక్ ఎంపీ రఘునందన్ రావు
- గజ్వేల్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం..
గజ్వేల్, వెలుగు: తప్పు చేసినవాడు కొడుకు అయినా, బిడ్డ అయినా వదిలిపెట్టనని జూన్2014లో శాసనసభలో మాట్లాడిన మాటలే ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్కు కూడా వర్తిస్తాయని ఉమ్మడి మెదక్ జిల్లా పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో బీజేపీ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థులతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఓటర్లను బీజేపీకి ఓటు వేయాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ గజ్వేల్ అభివృద్ధిలో ఆ పార్టీకి ఎలాంటి పాత్ర లేదని విమర్శించారు. పాత ప్రభుత్వం గజ్వేల్ను ‘గడ’గా మార్చిందని.. కొత్త ప్రభుత్వం కొడంగల్కు ‘కుడ’ అనే పేరు పెట్టిందని ఎద్దేవా చేశారు. ఇతర నియోజకవర్గాల ఆర్థిక పరిస్థితుల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదన్నారు.
పాత ప్రభుత్వానికి పది సంవత్సరాలు సోయి లేకపోతే, కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి రెండేళ్లుగా సోయి లేదని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను విమర్శిస్తున్నవారు పూర్తిగా గుడ్డివారని అన్నారు. ఒకే కుటుంబానికి చెందిన నాయకులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారని విమర్శిస్తూ, అందుకే ప్రజలు మీకు బండకేసి కొట్టారని అన్నారు. ఒకవైపు కేటీఆర్, మరోవైపు హరీశ్ రావు, ఇంకోవైపు కవిత వేర్వేరుగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
కేంద్ర బడ్జెట్లో దక్షిణ భారతదేశానికి ఏడు హైస్పీడ్ రైళ్లు కేటాయిస్తే, అందులో హైదరాబాద్కు మూడు హైస్పీడ్ రైళ్లు కేటాయించిన విషయాన్ని గమనించడం లేదన్నారు. గత బడ్జెట్తో పోలిస్తే ఈసారి రైల్వేకు 15 శాతం అధిక నిధులు కేటాయించారని తెలిపారు. తెలంగాణకు ఈసారి బడ్జెట్లో ‘సున్నా'’వచ్చిందని ఆరోపిస్తున్న ఆర్థిక శాఖ మంత్రి భట్టి గత బడ్జెట్తో పోలిస్తే ఈసారి డివల్యూషన్ ఫండ్స్గా ఒక్క ఖాతాలోనే రూ.1,300 కోట్లను నరేంద్ర మోదీ ప్రభుత్వం విడుదల చేసిన విషయం గుర్తించాలన్నారు.
