నల్గొండ : హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్,టీఆర్ఎస్ ములాఖత్ అయ్యాయన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు. బుధవారం నల్గొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అధికార పార్టీ ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు మొదలెట్టిందని అన్నారు. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలను ఎన్నికల ప్రచార సభగా మార్చారని రఘనందన్ ఆరోపించారు.
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక్క హుజూర్ నగర్ రైతులకు మాత్రమే రైతు బంధు డబ్బులు జమ చేయడంలో అధికార పార్టీ ఆంతర్యమేంటీ? అని రఘునందన్ ప్రశ్నించారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అధికార దుర్వినియోగం చేసైనా సరే హుజూర్ నగర్ స్థానాన్ని గెలుచుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోందని, వారు ఎన్ని కుట్రలు చేసినా హుజూర్ నగర్ లో కాషాయ జెండా ఎగరేస్తామని రఘునందన్ అన్నారు.