అక్టోబర్ 18న రామప్పకు రాహుల్‌‌, ప్రియాంకా గాంధీ

అక్టోబర్ 18న రామప్పకు రాహుల్‌‌, ప్రియాంకా గాంధీ

ములుగు/వెంకటాపూర్‌‌/కొత్తగూడ, వెలుగు :  ఏఐసీసీ నేత, ఎంపీ రాహుల్‌‌గాంధీ, ప్రియాంకా గాంధీ బుధవారం ములుగు జిల్లాలో పర్యటించనున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క చెప్పారు. వెంకటాపూర్‌‌ మండలంలోని రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రామంజాపూర్‌‌లో జరిగే బహిరంగ సభకు హాజరవుతారని తెలిపారు. ములుగులోని కాంగ్రెస్ ఆఫీస్‌‌లో సోమవారం డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాండిడేట్‌‌ గండ్ర సత్యనారాయణతో కలిసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌‌ మహిళలకు ప్రయారిటీ ఇస్తోందన్నారు. కాంగ్రెస్‌‌ మేనిఫెస్టోను బీఆర్‌‌ఎస్‌‌ కాపీ కొట్టిందన్నారు. కాంగ్రెస్‌‌ లీడర్లపై దుష్ర్పచారం చేస్తూ, ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు.

 తెలంగాణ సంక్షేమ పాలన రావాలంటే కాంగ్రెస్‌‌తోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌‌ కమిటీ మాజీ చైర్మన్‌‌ మల్లాది రామిరెడ్డి, కిసాన్‌‌ కాంగ్రెస్‌‌ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్‌‌గౌడ్‌‌, యూత్‌‌ కాంగ్రెస్‌‌ జిల్లా అధ్యక్షుడు బానోతు రవిచందర్, బీసీ సెల్‌‌ జిల్లా అధ్యక్షుడు వంగ రవియాదవ్, ములుగు మండల అధ్యక్షుడు ఎండి.చాంద్‌‌పాషా పాల్గొన్నారు. అనంతరం వెంకటాపూర్‌‌ మండలంలోని రామప్ప టెంపుల్‌‌ను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రచార రథాన్ని మహబూబాబాద్‌‌ జిల్లా గంగారం మండలం కోమట్లగూడెంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు జాడి వెంకటేశ్వర్లు ప్రారంభించారు.