నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ .. నిర్మల్, అలంపూర్​ సభలు

నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ .. నిర్మల్, అలంపూర్​ సభలు

హైదరాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికల ప్రచారానికి కేవలం 7 రోజులే మిగిలి ఉండడంతో రాష్ట్రంలో ప్రచారం కోసం కాంగ్రెస్ అగ్ర నేతల షెడ్యూల్ ఖరారు అయింది. ఆదివారం రాహుల్ గాంధీ, సోమవారం ప్రియాంక గాంధీ తెలంగాణకు రానున్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సభల్లో పాల్గొననున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్ లోక్ సభ పరిధిలోని నిర్మల్ బహిరంగ సభలో  రాహుల్ పాల్గొననున్నారు. సాయంత్రం 5 గంటలకు నాగర్ కర్నూల్​ లోక్ సభ పరిధిలోని అలంపూర్ లో  నిర్వహించనున్న సభకు  ఆయన హాజరవుతారు. 

ఈ నెల 6 న సాయంత్రం ప్రియాంక గాంధీ రాష్ట్రానికి రానున్నారు. 7, 8వ తేదీల్లో రాష్ట్రంలో ఆమె ప్రచారం నిర్వహించనున్నారు. 7 న ఉదయం 11 గంటలకు కామారెడ్డిలో ఏర్పాటు చేసిన సభలో ప్రియాంక పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్ కూకట్ పల్లిలో నిర్వహించనున్న కార్నర్ మీటింగ్ కు ఆమె అటెండ్ అవుతారు. 8 న ఉదయం 11 గంటలకు వరంగల్ లేదా భువనగిరి ఈ రెండింటిలో ఏదో ఒక సభకు ప్రియాంక హాజరవుతారు. దీనిపై ఈ నెల 6 న స్పష్టత రానున్నది.  అదేరోజు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ రోడ్ షోలో ప్రియాంక పాల్గొననున్నారు.

9న మరో విడత

రాహుల్ మరో విడత ప్రచారానికి రాష్ట్రానికి రానున్నట్టు తెలిసింది. ఈ నెల 9 న ఆయన రాష్ట్రంలో రెండో విడత ప్రచారం చేసే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాహుల్, ప్రియాంక సభలతో రాష్ట్రంలో కాంగ్రెస్ కు మంచి ఊపు వస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.