మోడీ నల్లచట్టాలకు కేసీఆర్ మద్దతిచ్చిండు : రాహుల్ గాంధీ

మోడీ నల్లచట్టాలకు కేసీఆర్ మద్దతిచ్చిండు : రాహుల్ గాంధీ

టీఆర్ఎస్, బీజేపీ రెండూ కలిసే పనిచేస్తున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రజల ఉసురు పోసుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన నల్లచట్టాలకు సీఎం కేసీఆర్ మద్దతిచ్చారని తెలిపారు. భారత్ జోడో యాత్రలో భాగంగా జడ్చర్లలో నిర్వహించిన సభలో రాహుల్ మాట్లాడారు. రైతులు, ఆదివాసీలు, దళితులు, గిరిజనుల భూములను గుంజుకునే పనిలో కేసీఆర్ ఉన్నడన్నారు. టీఆర్ఎస్ సర్కారు నిరంకుశ విధానాల వల్ల తెలంగాణలో రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ సర్కారు తెలంగాణలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి, నిరుద్యోగ సమస్యను పెంచిందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు.  

తెలంగాణ  సీఎం ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరు చెప్పి పేదల భూములను లాక్కొంటున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. అన్నదమ్ముల్లాంటి దేశ పౌరుల మధ్య బీజేపీ కొట్లాటలు పెట్టిస్తోందని రాహుల్ మండిపడ్డారు.  దేశంలో హింసా, ద్వేషాలను నిర్మూలించేందుకే కన్యాకుమారీ నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నానని వివరించారు. చేనేత కార్మికులు సంక్షోభంలో ఉన్నారని తెలిసినా వారిపై కేంద్ర సర్కారు 12 శాతం జీఎస్టీ మోపిందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చేనేత కార్మికులు జీఎస్టీ చెల్లిస్తున్నందుకు పరిహారాన్ని ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. మోడీ సర్కార్ ప్రభుత్వ వ్యవస్థలను ప్రైవేటు పరం చేసి దేశాన్ని కార్పొరేట్ల చేతుల్లో పెడుతోందన్నారు. ‘‘భారత్ జోడో  యాత్రలో హింసా-ద్వేషాలు లేవు. కులమతాలు లేవు. ఇదే నిజమైన భారతదేశం’’ అని రాహుల్ కామెంట్ చేశారు.