ఎంపీగా రాహుల్ గాంధీ ప్రమాణం.. జోడో జోడో భారత్ జోడో అని నినాదించిన సభ్యులు

 ఎంపీగా  రాహుల్ గాంధీ ప్రమాణం.. జోడో జోడో భారత్ జోడో అని నినాదించిన సభ్యులు

18వ లోక్‌సభ సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు ఎంపీలుగా ప్రమాణం చేశారు నేతలు. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఎంపీగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకుని ఆయన ప్రమాణస్వీకారం పూర్తిచేశారు. ప్రతిపక్ష నేతలంతా జోడో జోడో భారత్ జోడో అని నినాధించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆయన రెండు స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే. 

దీంతో వయనాడ్‌ స్థానాన్ని వదులుకుని రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే కేరళలోని  వయనాడ్‌ స్థానానికి ఆయన రాజీనామాను స్పీకర్‌ సోమవారం ఆమోదించారు. దీంతో నేడు ఆయన రాయ్‌బరేలీ (యూపీ) ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. 

ఇవాళ అంటే జూన్ 25, 2024 నాడు తెలంగాణ ఎంపీలు సహా మిగిలిన 264 మంది ప్రమాణం చేయనున్నారు.  జూన్ 26న స్పీకర్ ఎన్నిక, 27న ఉభయ సభలను ఉద్దేశిస్తూ రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. 28 నుంచి చర్చలు ప్రారంభం అవుతాయి.

 జులై 2 లేదా 3న ఎంపీల ప్రశ్నలకు మోదీ జవాబులిస్తారు. తర్వాత ఉభయ సభల వాయిదా పడే అవకాశాలున్నాయి. కేంద్ర బడ్జెట్ కోసం  జులై 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తారని సమాచారం.