
సికింద్రాబాద్, వెలుగు: దక్షిణ మధ్య రైల్వే నిరుపయోగమైన రైల్ కోచ్లను ఆధునీకరించి రెస్టారెంట్లుగా అందుబాటులోకి తెస్తోంది. నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ ఆవరణలో ఫుడ్లవర్స్ కు ప్రత్యేకమైన అనుభూతిని అందించడానికి రైల్ కోచ్ రెస్టారెంట్" ను ప్రారంభించింది. కాచిగూడ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఇంతకుముందు ప్రారంభించిన “రెస్టారెంట్ ఆన్ వీల్స్” తర్వాత తెలంగాణ లో ఇది రెండవ రైల్కోచ్ రెస్టారెంట్.
నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ జంట నగరాల సబర్బన్ నెట్వర్క్లోని అత్యంత రద్దీగా ఉండే రైలు స్టేషన్లలో ఒకటి. ఈ రెస్టారెంట్కోసం ఒక పాత కోచ్ ను పూర్తిగా ఆధునీకరించి పునరుద్ధరించారు. ఈ రైల్ కోచ్ రెస్టారెంట్ నిర్వహణను ఐదు సంవత్సరాల కాలానికి హైదరాబాద్ కి చెందిన మెసర్స్ బూమరాంగ్ రెస్టారెంట్ వారికి కేటాయించారు. జంట నగరాల ప్రజలకు ఈ రెస్టారెంటు ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ అన్నారు. రైల్వే చేపడుతున్న ఈ వినూత్న సౌకర్యాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.