అప్పు ఇచ్చిన పైసలు అడిగినందుకు హత్య.. వడ్డీ వ్యాపారిని చంపిన రైల్వే ఎంప్లాయ్

అప్పు ఇచ్చిన పైసలు అడిగినందుకు హత్య.. వడ్డీ వ్యాపారిని చంపిన రైల్వే ఎంప్లాయ్

హనుమకొండ/కాజీపేట, వెలుగు: వడ్డీ వ్యాపారి దారుణ హత్యకు గురైన ఘటన కాజీపేటలో శనివారం వెలుగులోకి వచ్చింది. అప్పుగా ఇచ్చిన డబ్బులు అడుగుతున్నాడన్న ఉద్దేశంతో ఓ రైల్వే ఎంప్లాయి వడ్డీ వ్యాపారిని హత్యచేశాడు. అనంతరం అతడి ఒంటిపై ఉన్న బంగారం తీసుకుని పరారయ్యాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్  నగరంలోని గిర్మాజీపేటకు చెందిన త్రిపురాది నవీన్ కుమార్(52) వడ్డీ వ్యాపారం చేసేవాడు. ఉద్యోగులు, వ్యాపారస్తులకు అప్పు ఇస్తూ.. గిరిగిరి రూపంలో వసూలు చేసేవాడు. ఈ క్రమంలోనే కాజీపేట లోకో షెడ్ లో పని చేసే గడ్డం ప్రవీణ్ కుమార్  ఆరు నెలల కింద రూ.50 వేలు అప్పు తీసుకున్నాడు.

కానీ, తీసుకున్న అప్పు చెల్లించకపోవడంతో శుక్రవారం రాత్రి ప్రవీణ్ కుమార్  ఉండే రైల్వే క్వార్టర్(రూం నెం.583/4)కు వెళ్లాడు. డబ్బులు ఇవ్వాలని నిలదీయడంతో.. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి గొడవకు దారి తీసింది. కోపంతో ప్రవీణ్ కుమార్  తన ఇంట్లో ఉన్న కత్తితో నవీన్ కుమార్ పై దాడి చేయగా, తీవ్రగాయాలతో అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం ఆయన ఒంటిపై ఉన్న రూ.6 లక్షల విలువైన బంగారాన్ని దోచుకుని, ప్రవీణ్​ కుమార్  అక్కడి నుంచి పరారయ్యాడు. అప్పు వసూలు కోసం వెళ్లిన నవీన్ కుమార్ ఇంటికి రాకపోవడంతో ఆయన భార్య మాధవి రైల్వే క్వార్టర్స్ లోని ప్రవీణ్  ఇంటికి వెళ్లింది. అక్కడ నవీన్ కుమార్  రక్తపు మడుగులో చనిపోయి కనిపించాడు. మాధవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కాజీపేట పోలీసులు తెలిపారు.