వందే భారత్ స్లీపర్ వెర్షన్ రైళ్లు ఇలానే ఉంటాయట

వందే భారత్ స్లీపర్ వెర్షన్ రైళ్లు ఇలానే ఉంటాయట

కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్.. పబ్లిక్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ కోచ్‌లకు సంబంధించిన కొన్ని అద్భుతమైన నమూనా చిత్రాలను విడుదల చేశారు. వీటిని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF), భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) సంయుక్తంగా తయారు చేస్తారు. స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన ఈ సెమీ-హై స్పీడ్ రైలు కోచ్‌ల కాన్సెప్ట్ చిత్రాలను విడుదల చేస్తూ, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ వెర్షన్‌లను 2024 ప్రారంభంలో ప్రారంభించనున్నట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో కొత్తగా రూపొందించిన స్లీపర్ కోచ్‌లు ఫిబ్రవరి 2024 నాటికి అందుబాటులోకి వస్తాయని గత వారం వార్తలు వచ్చాయి. అశ్విని వైష్ణవ్ ఇటీవల వెల్లడించిన చిత్రాలు అత్యాధునిక ఇంటీరియర్, సౌకర్యాలతో ప్రయాణీకులకు విప్లవాత్మకమైన రైలు ప్రయాణ అనుభవాన్ని అందించాయి. ఈ కాన్సెప్ట్ స్లీపర్ కోచ్‌లు సౌకర్యవంతమైన సీట్లతో పాటు క్లాసిక్ చెక్క డిజైన్‌ను కలిగి ఉంటాయి. ఈ కోచ్‌లలో యాంబియంట్ ఫ్లోర్ లైటింగ్, టాప్ లైట్లు కూడా ఉన్నాయి.

మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఫిబ్రవరి 2019లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ ప్రీమియం రైలు మొదట న్యూ ఢిల్లీ - వారణాసి మధ్య తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇప్పుడు రాబోతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ వెర్షన్ ప్రీమియం రైళ్లతో పాటుగా మరిన్ని సౌకర్యాలను అందిస్తుందని పలువురు భావిస్తున్నారు.