
- తెలంగాణకు ఈ ఏడాది రూ.5,330 కోట్లు కేటాయింపు
- ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టేందుకు నిర్ణయం
- నివేదికల రూపంలో కొత్త ప్రాజెక్ట్లు వెల్లడి
హైదరాబాద్సిటీ, వెలుగు: దక్షిణ మధ్య రైల్వేకు ఈ ఆర్థిక సంవత్సరం కేటాయించిన నిధులను.. వర్క్స్ ఆధారంగానే రిలీజ్ చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. 2025–26 ఫైనాన్షియల్ ఇయర్లో తెలంగాణకు రూ.5,330 కోట్లు కేంద్రం కేటాయించింది. ఈ మొత్తం ఏఏ ప్రాజెక్ట్లకు.. ఎంతెంత కేటాయించారన్నది పింక్ బుక్ ద్వారా తెలిసేది. ఈ ఏడాది బడ్జెట్ ప్రకటించి 4 నెలలు అవుతున్నా పింక్ బుక్ రిలీజ్ చేయలేదు. అయితే, పింక్బుక్ విధానానికి రైల్వే శాఖ స్వస్తి పలికినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇటీవల పార్లమెంట్లో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ విషచయం వెల్లడించారు. ఇక నుంచి పింక్ బుక్ రిలీజ్ ఉండదని, ఆయా రైల్వే జోన్ల వారీగా నిధుల కేటాయింపులు జరిగాయని తెలిపారు. ప్రాజెక్ట్లు కంప్లీట్ అయినప్పుడల్లా కేటాయింపుల నుంచే నిధులు రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ప్రాధాన్యతా క్రమంలో నిర్వహించే పనులకు నిధుల కొరత లేకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.
ఏమిటీ పింక్ బుక్?
ఏటా బడ్జెట్ ప్రకటించిన తర్వాత కొద్ది రోజులకే రైల్వే శాఖ పింక్ బుక్ విడుదల చేసేది. రైల్వే శాఖకు సంబంధించిన ఆదాయం, ఖర్చుల వివరాలు పింక్ బుక్లో ఉండేవి. యాక్టివ్గా ఉన్న రైల్వే పనులను పూర్తి చేయడానికే కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నది. ప్రత్యేక బడ్జెట్కు స్వస్తి పలికినట్లు అధికారులు చెప్తున్నారు. వివిధ రాష్ట్రాలు, జోన్లు, ప్రాజెక్ట్లు, రైల్వే స్టేషన్ల వారీగా నిధుల కేటాయింపుల వివరాలన్నీ పింక్ బుక్లో ఉండేవి. అయితే, ఇక నుంచి రైల్వే ప్రాజెక్ట్లు, కేటాయింపులు తెలుసుకోవడం కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. ప్రయాణికుల సౌకర్యాలు, భద్రత వంటి అంశాల వివరాలు, కేటాయింపులు కూడా తెలుసుకోలేని పరిస్థితి. ఇక నుంచి కొత్త ప్రాజెక్టులు, కొత్త లైన్లు, డబ్లింగ్ వర్క్స్ వివరాలను అధికారులు నివేదిక ద్వారా వెల్లడించనున్నారు. ప్రస్తుతం తెలంగాణ, ఏపీ పరిధిలో రూ.27,670.93 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి.