
పూరీ జగన్నాథ స్వామి ఆలయంలోని రత్న భాండాగారంలో ఉన్న లోపల గది తాళాలను తెరిచారు. ఆ రహస్య గదిలో ఉన్న విలువైన ఆభరణాలను, సంపదను టెంపరరీ స్ట్రాంగ్ రూంకు తరలించే పని మొదలైంది. రత్న భాండాగారం లోపల గది తాళం తెరిచిన సమయంలోనే వర్షం పడటంతో భక్తులు శుభ సూచకంగా భావించారు. ఇవాళ సాయంత్రానికి లోపల గదిలో ఉన్న విలువైన ఆభరణాలను తరలించడం పూర్తవుతుందని పూరీ గజపతి మహారాజ దివ్యసింగ్ దేవ్ తెలిపారు.
రత్న భాండాగారంలోని విలువైన సంపదను తాత్కాలికంగా భద్రపరిచే స్ట్రాంగ్ రూంకు హై సెక్యూరిటీ కల్పించినట్లు చెప్పారు. రత్న భాండాగారంలో సొరంగాలు, రహస్య మార్గాలు ఉన్నాయా అని పూరీ గజపతి మహారాజాను అడగ్గా.. ఏఎస్ఐ పరిశీలన అనంతరం పూర్తి స్థాయి స్పష్టత వస్తుందని, క్షుణ్ణంగా పరిశీలించేందుకు లేజర్ స్కానింగ్ కూడా వినియోగించబోతున్నారని తెలిపారు. 11 మందితో కూడిన బృందం రత్న భాండాగార సంపదను తరలించే పనిలో తలమునకలై ఉంది.
Also Read :- ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ తల్లి అరెస్ట్
రత్న భాండాగారం సంపద తరలించే ప్రక్రియ మొదలుకావడంతో భక్తులను ఉదయం 8 గంటల నుంచి అనుమతించలేదు. సింగద్వార తప్ప మిగిలిన మూడు గేట్లను మూసివేశారు. పూరీ జగన్నాథ స్వామి ఆలయంలోని రత్న భాండాగార సంపద లెక్క గట్టే ప్రక్రియను 30 నుంచి 40 రోజుల్లో పూర్తి చేస్తామని ఒడిశా న్యాయ శాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ తెలిపారు. 1978లో ఈ భాండాగార సంపదను గణించడానికి 70 రోజులు పట్టినట్లు సమాచారం.
రత్న భాండాగార మొత్తం సంపదను టెంపరరీ స్ట్రాంగ్ రూంకు తరలించాక ఏఎస్ఐ రిపేర్ వర్క్ మొదలవుతుంది. ఇదిలా ఉండగా రత్న భాండాగారం లోపల గదిలో పాములు ఉండొచ్చనే కారణంగా స్నేక్ హెల్ప్ లైన్ టీంను (ODRAF Team) సిద్ధం చేశారు. గత ఆదివారం రత్న భాండాగారాన్ని తెరిచినప్పుడు పాములు ఏం కనిపించలేదు. ఎందుకైనా మంచిదని స్నేక్ క్యాచర్స్ను కూడా శ్రీ జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ (SJTA) పిలిపించింది.