- 1xBetపై కొనసాగుతున్న విచారణలో చర్యలు
- పీఎంఎల్ఏ కింద దర్యాప్తు సంస్థ తాత్కాలిక ఉత్తర్వులు
న్యూఢిల్లీ:
ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధావన్కు చెందిన రూ.11.14 కోట్ల విలువైన ఆస్తుల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. ఈ మేరకు ఈడీ అధికారులు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆఫ్షోర్ బెట్టింగ్ ప్లాట్ఫామ్ 1xBet, దాని అనుబంధ సంస్థలపై కొనసాగుతున్న విచారణలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. సురేశ్ రైనా పేరు మీద ఉన్న రూ. 6.64 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, శిఖర్ ధావన్కు చెందిన రూ. 4.5 కోట్ల విలువైన ప్రాపర్టీని అటాచ్ చేస్తూ మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ ఏ)కింద ఈడీ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలోని పలు రాష్ట్రాల పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నది.
1000కోట్ల మనీలాండరింగ్ జరిగినట్టు అనుమానం
అక్రమ లావాదేవీల కోసం 6000 మ్యూల్ ఖాతాలను ఉపయోగించినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. నాలుగు పేమెంట్ గేట్వేలపై సోదాలు చేసి 60 బ్యాంకు ఖాతాల్లోని రూ. 4 కోట్లకు పైగా నిధులను ఫ్రీజ్ చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు రూ. 1,000 కోట్లకు పైగా మనీ లాండరింగ్ జరిగినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.
భారత్ లో 1xBet అనుమతులు తీసుకోకుండానే కార్యకలాపాలు నిర్వహించింది. భారతీయ వినియోగదారులను ఆకర్షించడానికి సోషల్ మీడియా, ఆన్ లైన్ వీడియోలు, ప్రింట్ మీడియా ద్వారా సరోగేట్ బ్రాండింగ్, ప్రకటనలను ఉపయోగించుకుంది. అక్రమ నిధుల మూలాన్ని దాచిపెట్టడానికి విదేశీ మధ్యవర్తులను ఉపయోగించుకుని లేయర్డ్ లావాదేవీల ద్వారా ఎండార్స్మెంట్ల కోసం చెల్లింపులు జరిపింది. ఈ సందర్భంగా ప్రజలకు ఈడీ కీలక సూచనలు చేసింది. ఆన్ లైన్ బెట్టింగ్, జూదంపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
సున్నితమైన బ్యాంక్ ఖాతా వివరాలను గుర్తుతెలియని సంస్థలతో పంచుకోవద్దని కోరింది. ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు సహకరించినట్టు తేలితే పీఎంఎల్ ఏ కింద ఏడేండ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని హెచ్చరించింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్లకు సంబంధించి మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్పతోపాటు నటులు సోనూ సూద్, ఊర్వశీ రౌతేలా, మిమి చక్రవర్తి (తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ), అంకుశ్ హజ్రా (బెంగాలీ నటుడు)ను ఈడీ గతంలోనే ప్రశ్నించింది.
అన్ని విషయాలు తెలిసే విదేశీ సంస్థలతో ఒప్పందాలు
సురేశ్ రైనా, శిఖర్ ధావన్ అన్ని విషయాలు తెలిసే 1xBet, దాని అనుబంధ సంస్థల ప్రమోషన్ కోసం విదేశీ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారని ఈడీ దర్యాప్తులో తేల్చింది. ఈ ప్రమోషన్ల కోసం వారికి అందిన చెల్లింపులను, వాటి అక్రమ మూలాలను దాచిపెట్టేందుకు క్లిష్టమైన విదేశీ లావాదేవీల ద్వారా దారి మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. ఈ సొమ్మును బెట్టింగ్ కార్యకలాపాల ద్వారా వచ్చిన అక్రమ ఆదాయంగా పరిగణిస్తున్నట్టు వెల్లడించారు. వినియోగదారుల నుంచి సేకరించిన నిధులను సరైన కేవైసీ లేకుండా పలు పేమెంట్ గేట్వేల ద్వారా మళ్లించి, నిధుల మూలాలను మరుగుపరిచినట్టు వివరించారు.
