పాపం రాజయ్య!

పాపం రాజయ్య!
  •     వరంగల్ ​ఎంపీ టికెట్​ కోసం వచ్చి.. 
  •     ఫామ్​హౌజ్​ వెళ్లకుండా దగ్గర్లో నిరీక్షించి.. నిరాశతో వెనక్కి
  •     కేసీఆర్​ ఫామ్​హౌజ్​ వద్ద హైడ్రామా

గజ్వేల్/ములుగు, వెలుగు :  గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజయ్య..ఎమ్మెల్యే టికెట్​దక్కకపోవడంతో పాటు పార్టీలో ఆదరణ లేదని ఇటీవలే బీఆర్ఎస్​కు రాజీనామా చేశారు..  మారిన రాజకీయ పరిణామాల మధ్య ఈయనకు ప్రత్యర్థిగా ఉన్న కడియం శ్రీహరి, తన కూతురు కావ్యతో కలిసి బీఆర్ఎస్​ను వీడి కాంగ్రెస్ లోకి వెళ్లడంతో సీన్​ రివర్స్​ అయ్యింది. అభ్యర్థిగా ఎంపిక చేశాక కావ్య కారు దిగడంతో ఆ స్థానంలో రాజయ్యను ఎంపిక చేస్తారన్న ప్రచారం మొదలైంది.

ఈ క్రమంలో ఆయన శుక్రవారం బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్​ను కలవడానికి ఫామ్​హౌజ్​కు బయలుదేరారు. ఫామ్​హౌజ్​లో అప్పటికే వరంగల్​ జిల్లాకు చెందిన నాయకులతో టికెట్​ విషయమై చర్చలు జరుగుతన్నాయన్న విషయం తెలుసుకున్న రాజయ్య ఫామ్​హౌజ్​సమీపానికి వచ్చి ఆగిపోయారు. తనకు టికెట్​కన్ఫామ్​ చేశాకే అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకుని

సమీపంలో ఓ బీఆర్ఎస్​ నాయకుడి ఫామ్​హౌజ్​లో మూడు గంటలు వెయిట్​చేశారు. కానీ, కేసీఆర్​ ..రాజయ్యకు కాకుండా వరంగల్​ బీఆర్ఎస్​ ఎంపీ అభ్యర్థిగా ప్రస్తుత జడ్పీ చైర్మన్​ సుధీర్​కుమార్​ పేరును ఖరారు చేశారు. తనకు టిక్కెట్​ దక్కలేదని తెలుసుకున్న రాజయ్య అక్కడి నుంచి ఉసూరుమంటూ వెనుదిరిగారు.