సెస్ దగ్ధంపై తేలని విచారణ..మూడేండ్లుగా ముందుకు సాగని వైనం

సెస్ దగ్ధంపై తేలని విచారణ..మూడేండ్లుగా ముందుకు సాగని వైనం
  • తాజాగా  విచారణ కోసం ఎన్పీడీసీఎల్ కు లేటర్ 
  • 2023 నవంబర్ 12  న సెస్ ఫస్ట్ ఫ్లోర్ లో  కాలిబూడిదైన ఫైళ్లు
  • దగ్ధంపై పలు అనుమానాలు

రాజన్న సిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్​) ఫస్ట్ ఫ్లోర్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగి మూడేండ్లయినా విచారణ ముందుకు సాగడం లేదు. ప్రమాదం జరిగిన మరుసటి రోజే పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎంక్వైరీ ముందుకు సాగకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. అగ్ని ప్రమాదం జరిగి మూడేండ్లు గడిచిన తర్వాత తాజాగా ఎంక్వైరీ కోసం ఎన్పీడీసీఎల్ లెటర్ రాయడం చర్చనీయాంశంగా మారింది.  

2023 నవంబర్ 12 దీపావళి నాడు సెస్ ఆఫీస్ లోని ఫస్ట్ ఫ్లోర్ లో పర్చేస్ రూంలో మంటలు అంటుకుని విలువైన ఫైళ్లు కాలి బూడిదయ్యాయి. ఎన్నడూ లేని విధంగా సెస్ ఆఫీసులో పూజలు నిర్వహించి, చైర్మన్ లేకుండా పటాకులు కాల్చారు. దీంతో  ఫస్ట్ ఫ్లోర్ పర్చేస్ రూంలో మంటలు చెలరేగి ఫైళ్లు, కంప్యూటర్లు కాలిపోయాయి.  కావాలనే కాలబెట్టారా, ప్రమాదవశాత్తు జరిగిందా అనే చర్చ అప్పట్లో నడిచింది. ప్రమాదం జరిగిన మరుసటి రోజు చైర్మన్ చిక్కాల రామారావు  పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సెస్ పై తీవ్ర అవినీతి ఆరోపణలు 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1970 నుంచి విద్యుత్ రంగంలో సెస్ సేవలందిస్తోంది. సెస్ పరిధిలో 2.50 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. కోట్లలో టర్నోవర్ ఉన్న సంస్థ క్రమంగా అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయింది. 2007 నుంచి 2011 మధ్య ఉన్న పాలకవర్గం పనితీరుపై తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో  2007–-2011 పాలక వర్గం అవినీతిపై విచారణ జరిపించాలని అప్పటి సెస్ పర్సన్ ఇన్​చార్జిగా ఉన్న జాయింట్ కలెక్టర్ అరుణ కుమార్, ​ఎన్పీడీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్‌‌‌‌కు లెటర్ రాశారు. ఎంక్వైరీస్  ఎస్ఈఈ కృష్ణయ్య  బృందం విచారణ ప్రారంభించగా అప్పటి పాలకవర్గం హై కోర్టు నుంచి స్టే తేవడంతో విచారణ నిలిచిపోయింది.

మూడేండ్ల తర్వాత ఎన్పీడీసీఎల్ కు లెటర్

సెస్ ఆఫీస్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగి మూడేండ్లు అవుతోంది. మూడేండ్ల తర్వాత సెస్ దగ్ధంపై ఇటీవల ఎన్పీడీసీఎల్​(నార్తర్న్  పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్) కు ఎంక్వైరీ చేయాలని సెస్ పాలకవర్గం జూన్ మొదటి వారంలో లెటర్ రాసింది. మూడేండ్ల నాన్చివేత ధోరణి ప్రదర్శించి ఇప్పుడు లెటర్ రాయడం వెనక మతలబు ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. 

నూతన ఎండీకి బాధ్యతలు 

సెస్ లో ఏ పని జరిగినా సిరిసిల్లలో చర్చనీయాంశం అవుతోంది.  ఇటీవల సెస్ ఎండీగా  పిన్నింటి మోహన్ రెడ్డి (రిటైర్డ్​ ఉద్యోగి )ని నియమించడం చర్చకు దారితీసింది.  మొన్నటి వరకు సెస్ ఎండీగా ఉన్న విజయేందర్ రెడ్డి  సెలవుపై అమెరికా వెళ్లిన క్రమంలో ఆయనను తొలగించి  కొత్త ఎండీని  నియమించారు. విజయేందర్ రెడ్డి గతంలో సెస్ లో జరిగిన  ఆవినీతి ఆరోపణలు నేపథ్యంలో విజిలెన్స్ ఎంక్వైరీ కి సహకరిస్తున్నారనే ఆయనను తొలగించారనే చర్చ నడుస్తోంది.