రష్యా విక్టరీ డే పరేడ్ లో రాజ్‌నాథ్ సింగ్…

రష్యా విక్టరీ డే పరేడ్ లో రాజ్‌నాథ్ సింగ్…

రష్యాలో జరుగుతున్న విక్టరీ డే పరేడ్ 75వ వార్షికోత్సవంలో భారత సాయుధ దళాల బృందం పాల్గొంటున్నందుకు గర్వంగా ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. విక్టరీ డే పరేడ్ 75వ వార్షికోత్సవంలో పాల్గొనడానికి రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఆహ్వానం మేరకు రాజ్‌నాథ్ సింగ్ మూడు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం రష్యాకు చేరుకున్నారు. కరోనావైరస్ కారణంగా మే 9న జరగాల్సిన ఈ పరేడ్ ను రష్యా వాయిదా వేసింది. మళ్లీ ఇప్పడు ఆ పరేడ్ ను నిర్వహించింది.

1941-1945 మధ్య జరిగిన రెండో ప్రపంచ యుద్ధంలో సాధించిన విజయానికి ప్రతీకగా తమ దేశభక్తిని చాటుతూ రష్యా ప్రతి ఏటా విజయోత్సవ పరేడ్‌ను జరుపుతున్నది. ఈ ఏడాది 75వ విజయోత్సవ పరేడ్‌ను మాస్కోలోని రెడ్ స్క్వేర్ వద్ద గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ పరేడ్ లో ఇండియాకు చెందిన 75 మంది సభ్యుల ట్రై-సర్వీస్ సైనిక బృందం పాల్గొంది. చైనాతో సహా 11 దేశాల సాయుధ దళ సిబ్బందితో కలిసి భారత జట్టు ఈ పరేడ్ లో పాల్గొంది. ఈ పరేడ్ అనంతరం రాజ్‌నాథ్ సింగ్, రష్యా ఉప ప్రధాని యూరీ బోరిసోవ్‌ కలిసి రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధం మరియు ప్రాంతీయ సమస్యలపై చర్చలు జరిపారు.

విక్టరీ డే సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ రష్యా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘మాస్కోలో జరిగిన విక్టరీ డే పరేడ్‌లో భారత సాయుధ దళాల ట్రై-సర్వీస్ బృందం పాల్గొనడం నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది’ అని ఆయన ట్వీట్ చేశారు. కరోనావైరస్ కారణంగా గత నాలుగు నెలల నుంచి అంతర్జాతీయ ప్రయాణాలు పూర్తిగా నిలిపివేయబడ్డాయి. నాలుగు నెలల తర్వాత.. మొదటగా విదేశీ పర్యటన చేసిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కావడం గమనార్హం.

For More News..

పెట్రోల్‌ను దాటేసిన డీజిల్ ధరలు