- కాంగ్రెస్ ఎన్నో అభివృద్ధి పనులు చేసింది, కానీ చెప్పుకోవడంలో లోపం కనిపిస్తోంది
- జులైలో మామునూరు ఎయిర్పోర్టుకు శంకుస్థాపన
- రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి
వరంగల్, వెలుగు: ‘బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేసే క్రమంలో రేవంత్రెడ్డిని ఏడెనిమిదేండ్లు రాజకీయంగా, ఆర్థికంగా, శారీరకంగా నానారకాలుగా ఇబ్బందులు పెట్టారు, సీఎం రేవంత్రెడ్డి తనకు దేవుడిచ్చిన సోదరుడు, ప్రాణమిత్రుడు, అతడి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తాను’ అని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి చెప్పారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నరేందర్రెడ్డికి ఆదివారం హనుమకొండ హంటర్రోడ్డులోని డీ కన్వెన్షన్ హాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా నరేందర్రెడ్డి మాట్లాడుతూ... మరో 25 ఏండ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండేలా కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేండ్లలో సన్నబియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత విద్యుత్, రైతుభరోసా, రుణమాఫీ, ఫ్రీ బస్సు వంటి చేసిన అభివృద్ధి పనులు చేసిందని, కానీ చెప్పుకోవడంలో లోపం కనిపిస్తోందన్నారు.
జీడబ్ల్యూఎంసీకి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. జులై మొదటి, రెండో వారంలో మామునూర్ ఎయిర్పోర్టు పనులకు ప్రధాని మోదీ చేతులమీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. ఏడాదిన్నరలో ఢిల్లీ నుంచి డైరెక్ట్గా మామునూర్ ఎయిర్పోర్టులోనే విమానం దిగవచ్చన్నారు.
వేం నరేందర్రెడ్డి సహకారంతో నిధులు:
మంత్రులు సీతక్క, సురేఖ, ఎమ్మెల్యే నాయిని ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఎక్కువ నిధులు రావడానికి వేం నరేందర్రెడ్డి సహకారమే కారణమని మంత్రులు ధనసరి సీతక్క, కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో వరంగల్ అభివృద్ధిలో 20 ఏండ్లు వెనక్కి పోయిందన్నారు.
ఫండ్స్, పదవుల్లో వరంగల్కు సముచిత స్థానం ఇవ్వాలని కోరారు. అలాగే ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కేఆర్.నాగరాజు, రేవూరి ప్రకాశ్రెడ్డి, ఎమ్మెల్సీ సారయ్య, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు రామచంద్రనాయక్, గండ్ర సత్యనారాయణ, సిరిసిల్ల రాజయ్య, కూరపాటి వెంకటనారాయణ, రియాజ్ పాల్గొన్నారు.
