కశ్మీర్ ఇపుడు రియలైజ్ అవుతోంది : రామ్ మాధవ్

కశ్మీర్ ఇపుడు రియలైజ్ అవుతోంది : రామ్ మాధవ్

కరీంనగర్ ఎంపీగా బీజేపీ నేతలు గెలిచిన ప్రతిసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. హైదరాబాద్ విలీన బాధ్యత సర్దార్ వల్లభాయ్ పటేల్ కాకుండా నెహ్రూ తీసుకుని ఉంటే ఇక్కడ కూడా 370వ అధికరణం వచ్చేదని అన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్. తెలంగాణ ప్రజలు ఈ విషయంలో అదృష్టవంతులని చెప్పారు. కొద్దిమంది మాత్రం అజ్ఙానంతో ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. 72 ఏళ్ల సమస్యను 72 గంటల్లో పరిష్కరించామన్నారు.

“370 ఆర్టికల్ రద్దు చేయాలని బాల్యం నుంచి పోరాడి వృద్ధులైన వారున్నారు. వాళ్ళందరినీ త్వరలో సన్మానిస్తాం. దేశంలో ఎక్కడివారైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకునే స్వేచ్ఛ జమ్మూ కశ్మీర్ లో చేసుకునే వీలుండేది కాదు. జాతీయ జెండాతో సమానంగా కశ్మీర్ జెండా ఎగరాలని రూలుండేది. రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానులు, రెండు జెండాల పద్ధతితో అక్కడి ప్రజలు అవస్థలు పడ్డారు. కొందరే లాభ పడ్డారు. పాకిస్థాన్ నుంచి ఇండియాకి శరణార్థులుగా వచ్చిన వారు దేశ ప్రధానులయ్యారు. 70 ఏళ్లుగా కశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల కోసం బీజేపీ పోరాడటం వల్ల కొంత కాలం క్రితమే రిజర్వేషన్ వచ్చింది. ఇతర ప్రాంతాల నుంచి జమ్మూ కశ్మీర్ కు వెళ్లిన వారికి ఎలాంటి ప్రాథమిక హక్కులుండేవి కావు. మహిళలందరికీ తాను కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకునే స్వేచ్ఛ లేదు. కేవలం అక్కడి వారినే చేసుకోవాలి. లేదంటే పౌరసత్వం రద్దయ్యేది. మగవాళ్లకు మాత్రం ఈ నిబంధన చెల్లదు” అని అన్నారు రామ్ మాధవ్.

“ఇలాంటి ఆర్టికల్ తీసేస్తే రాద్ధాంతం ఎందుకు? అక్కడి ప్రజలను అడగకుండా తీసేసారంటున్నవాళ్లు.. అసలు ఎవరినడిగి తెచ్చారు? ఈ ఆర్టికల్ ప్రవేశ పెట్టేటప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఇద్దరు తప్ప అందరూ వ్యతిరేకించారు. అందరూ వ్యతిరేకించినా నెహ్రూ వల్లే ఈ ఆర్టికల్ వచ్చింది. కశ్మీర్ లోని కొందరి రాజకీయ అవసరాలకు మాత్రమే ఇది ఉపయోగపడింది. అక్కడి ప్రజలు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. అక్కడి ప్రజలు తాము ఇంతకాలం మోసపోయామని అర్థం చేసుకుంటున్నారు” అని రామ్ మాధవ్ చెప్పారు.

“ఐదేళ్లలో రూ.90 వేల కోట్ల ఆర్థిక సహాయం ఆ రాష్ట్రానికి అందించాం. జమ్ముకశ్మీర్ ప్రజల డిగ్నిటీ కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. జమ్మూ కశ్మీర్ ను పాకిస్థాన్ కోణంలో చూడొద్దు. అది మనది. పాకిస్థాన్ ను ఎలా కంట్రోల్ చేయాలో మనకు తెలుసు. అక్కడి ప్రజల రాజకీయ అధికారాలు, అభివృద్ధి, ప్రజలకు డిగ్నిటీ కోసం ప్రయత్నిస్తున్నాం. జమ్ము కశ్మీర్ భూభాగం మాత్రమే కాదు అక్కడి ప్రజలు కూడా మనవాళ్లే. వాళ్లను మనం ఆలింగనం చేసుకోవాలి. సెలవుల్లో మనందరం అక్కడికి విహార యాత్రలకు వెళ్ళాలి. అక్కడ సామాన్య పరిస్థితులు మెరుగు పడడానికి ప్రజలందరూ సహకరించాలి” అన్నారు రామ్ మాధవ్.

జమ్ము కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణం చట్టం, ఆర్టికల్ 370 రద్దు- వర్థమాన పరిస్థితులు అంశంపై కరీంనగర్ లో జరిగిన సెమినార్ లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీ బండి సంజయ్, ఇతర నాయకులు, మేధావులు, బీజేపీ వర్కర్లు పాల్గొన్నారు.