
- డిప్యూటీ స్పీకర్ రామచంద్రునాయక్
సూర్యాపేట, వెలుగు : ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్సేనని శాసనసభ డిప్యూటీ స్పీకర్ రామచంద్రునాయక్ అన్నారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి సహకారంతో ట్రైకార్ చైర్మన్ బెల్లయ్యనాయక్ అధ్యక్షతన జరిగిన ఆదివాసి కాంగ్రెస్ బునియాది కార్యకర్తల సమ్మేళనం గురువారం ముగిసింది. ఈ కార్యక్రమానికి కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీ, గిరిజనులకు ఏదైనా లబ్ధిచేకూరిందంటే అది కాంగ్రెస్ హయాంలోనేని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం అంబానీ, అదానీలకు కట్టబెడుతుందని ఆరోపించారు. దేశంలో కార్పొరేట్, రాచరిక వ్యవస్థను తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు.
బీజేపీ కుటిల ప్రయత్నాలను ప్రశ్నించిన ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ అని చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేవరకు ప్రతి కార్యకర్త సైనికుడిల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల రూ.200 కోట్ల ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను విడుదల చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందన్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించాలని సూచించారు. కార్యక్రమంలో ఆదివాసి కాంగ్రెస్ బునియాది శిక్షణ శిబిరం జాతీయ కో–ఆర్డినేటర్ రాహుల్ బాల్, కాంగ్రెస్ ఎస్టీ సెల్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ కోట్య నాయక్ భూక్య, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అభినయ్, నాయకులు పాల్గొన్నారు.