గోదావరిఖని, వెలుగు : రామగుండం కార్పొరేషన్లో 2026–-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను బుధవారం మేయర్ మహాంకాళి స్వామి అధ్యక్షతన జరిగిన బడ్జెట్ ప్రత్యేక సమావేశంలో ఆమోదించారు. ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.248 కోట్ల 66 లక్షల 51 వేలు కాగా వ్యయం రూ.220 కోట్ల 57 లక్షల 76 వేలు, మిగులు రూ.28 కోట్ల 8 లక్షల 75 వేలుగా అంచనా వేశారు. ఈ బడ్జెట్ ప్రతిపాదనలకు సభ్యులు ఆమోదం తెలిపారు. అనంతరం మొదటి సాధారణ సమావేశం నిర్వహించారు. ఇందులో ఎనిమిది అంశాలు ప్రవేశపెట్టగా వాటిని సభ్యులు ఆమోదించారు. కార్పొరేషన్లో ఔట్ సోర్సింగ్, కాంటాక్ట్ విధానంలో ఆయా విభాగాల్లో పని చేస్తున్న సిబ్బంది కాల పరిమితిని మరో ఏడాది పొడిగిస్తూ తీర్మానం చేశారు.
ఆ తరువాత పలువురు కార్పొరేటర్లు తమ డివిజన్ సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మేయర్ మహాంకాళి స్వామి మాట్లాడుతూ కార్పొరేటర్లు సభ దృష్టికి తెచ్చిన సమస్యలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ పరిష్కరించాలని అధికారులకు సూచించారు. త్వరలో రూ.1.25 కోట్ల విలువైన టెండర్లు తెరిచి అభివృద్ధి పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. రామగుండం కార్పొరేషన్ ప్రాంతాన్ని సకల వసతులతో కూడిన సుందర నగరంగా అభివృద్ధి చేయడానికి కార్పొరేటర్లు సహకరించాలని కోరారు.
