గోదావరిఖని, వెలుగు: జల విద్యుత్, సోలార్ పవర్ పెరగడంతో పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ ప్లాంట్లోని పలు యూనిట్లను షట్ డౌన్ చేసి విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. శనివారం రాత్రి నుంచి పలు ధపాలుగా విద్యుత్ ఉత్పత్తికి బ్రేక్ వేశారు.
తెలంగాణ ప్లాంట్లోని 800 మెగావాట్ల మొదటి యూనిట్, రామగుండం ప్లాంట్లోని 200 మెగావాట్ల మూడు యూనిట్లు, 500 మెగావాట్ల 5వ యూనిట్లో విద్యుత్ ఉత్పత్తికి బ్రేక్ పడింది. గుజరాత్లోని ఖావ్డాలోని 165 మెగావాట్ల సోలార్ పవర్ను నేషనల్ గ్రిడ్కు అనుసంధానం చేయడం, దేశంలోని పలు ప్రాంతాల్లో సోలార్ విద్యుత్ఉత్పత్తి పెరగడం, నాలుగు రోజులుగా ఉత్తర భారతంలో భారీగా వర్షాలు కురవడంతో జల విద్యుత్ ఉత్పత్తి కూడా పెరిగింది. ఇటీవల విద్యుత్ వినియోగం తగ్గడంతో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశామని, అవసరాన్ని బట్టి ఉత్పత్తి ప్రారంభిస్తామని ఎన్టీపీసీ అధికారులు తెలిపారు.
