
బషీర్ బాగ్, వెలుగు: రామోజీ ఫిలిం సిటీలో ఆక్రమించుకున్న పేదల భూమిని, ప్రజా రహదారిని తిరిగి ఇచ్చేయాలని రామోజీ ఫిలిం సిటీ, ఈనాడు సంస్థల చీఫ్ రామోజీ రావును గోనె ప్రకాశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రకాశ్ రావు రాసిన బహిరంగ లేఖను బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో మీడియాకు రిలీజ్ చేసి మాట్లాడారు. 606 మంది పేద ప్రజలకు వైఎస్సార్ ఇచ్చిన 14.30 ఎకరాల ను రామోజీరావు ఆక్రమించుకున్నారని ఆరోపించారు.
నాగన్ పల్లి రెవెన్యూ సర్వే నెం 189, 203 కింద నాగన్పల్లి, ముక్కు నూరు, రాయపోలు, పోల్కంపల్లి ప్రజలకు వైఎస్ ఈ భూమిని కేటాయించినట్లు పేర్కొన్నారు. అనాజ్ పూర్ నుంచి ఇబ్రహీంపట్నందాకా ఉన్న 13 కిలోమీటర్ల రహదారిని ఆక్రమించి, ఫిలిం సిటీ గేటు ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు. దీంతో ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇబ్బందిగా మారిందన్నారు. ఈ విషయాలపై రామోజీ రావు మార్చ్ 31 లోగా స్పందించాలని గోనె ప్రకాశ్ డెడ్లైన్ విధించారు. పేదల భూములు వాపస్ ఇవ్వాలని, గేటును తొలగించాలని డిమాండ్ చేశారు.