- కాంట్రాక్టర్, 8 మంది డీలర్లు, సిబ్బంది సహా 15 మంది అరెస్ట్
- రూ.17.22 లక్షల విలువైన 300 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం
హైదరాబాద్, వెలుగు: రేషన్ బియ్యం రాకెట్ గుట్టును అధికారులు రట్టు చేశారు. లారీకి ఉండాల్సిన జీపీఎస్ను బైక్కు అమర్చి రేషన్ షాపులకు సరఫరా చేయాల్సిన బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్న భారీ రాకెట్ను సవిల్ సప్లయ్స్, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఛేదించారు. కాంట్రాక్టర్, 8 మంది డీలర్లు సహా 15 మందిని అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.17,22,600 విలువైన 300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల్ లెవెల్ స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్లో రేషన్ బియ్యాన్ని డైవర్ట్ చేస్తున్నట్లు గుర్తించారు. సివిల్ సప్లయ్స్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 2న సాయంత్రం 4:15 గంటలకు విశ్వసనీయ సమాచారం ఆధారంగా విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఒక బైక్ను అడ్డుకున్నారు. ఈ బైక్ పై ఫేక్ ట్రక్ షీట్లు ఉన్నాయి. లారీకి అమర్చాల్సిన జీపీఎస్ ట్రాకర్ను బైక్కు మార్చి వాహన కదలికలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినట్లు గుర్తించారు. ఈ ట్రక్ షీట్లలో ఉన్న వివరాల ప్రకారం లారీని ట్రేస్ చేసి నకిరిపేట సమీపంలో అడ్డుకున్నారు.
అందులోని 600 బస్తాలు (300 క్వింటాళ్లు) పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేషన్ షాపుల్లో బియ్యం నిల్వలు అధికంగా ఉండడంతో కొత్తగా వస్తున్న లారీ లోడ్ తో వచ్చే బియ్యాన్ని పక్కదారి పట్టించేందుకు స్టేజ్-1 కాంట్రాక్టర్తో కొందరు డీలర్లు, అధికారులు కుమ్మక్కైనట్లు గుర్తించారు. ప్రధాన నిందితులుగా స్టేజ్-1 కాంట్రాక్టర్ ఎన్. శ్రీనివాస్, అతని సహాయకుడు ప్రశాంత్, లారీ డ్రైవర్ అనిల్ కుమార్, ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జి జరుపుల సత్యవతి, డేటా ఎంట్రీ ఆపరేటర్ బానోత్ కృష్ణకుమార్ మరో 8 మంది రేషన్ డీలర్లతో సహా మొత్తం 15 మంది నిందితులపై కేసు నమోదు చేశారు. ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జికి రూ.20 వేలు, డేటా ఎంట్రీ ఆపరేటర్కు రూ.10 వేలు, మోటార్సైకిల్ డ్రైవర్కు రూ.10 వేలు లంచంగా ఇచ్చినట్టు గుర్తించారు.
