డిండి గురుకులంలో స్టూడెంట్లను కరిచిన ఎలుకలు

డిండి గురుకులంలో స్టూడెంట్లను కరిచిన ఎలుకలు
  •      స్థానిక ప్రభుత్వ హాస్పిటల్‌‌లో 16 మందికి ట్రీట్‌‌మెంట్‌‌
  •     ప్రిన్సిపాల్‌‌ను సస్పెండ్‌‌ చేయాలని విద్యార్థి సంఘాల ధర్నా

డిండి, వెలుగు : నల్గొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో స్టూడెంట్లను ఎలుకలు కరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూడు రోజుల్లోనే 12 మందిని ఎలుకలు కరిచాయి. ఎలుకలు కరిచాయంటూ 2వ తేదీన ఆరుగురు, 3న ఆరుగురు, 5న మరో నలుగురు స్థానిక ప్రభుత్వ హాస్పిటల్‌‌కు వచ్చారు. దీంతో అక్కడి డాక్టర్లు వారికి టీటీతో పాటు మరో ఇంజక్షన్‌‌ వేసి, మెడిసిన్‌‌ ఇచ్చారు.

 అయితే ఎలుకలు కరిచాయంటూ స్టూడెంట్లు వరుసగా వస్తుండడంతో అనుమానం వచ్చిన డాక్టర్‌‌ శైలి గురుకుల పాఠశాలను సందర్శించారు.పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో పాటు వాటిని క్లియర్‌‌ చేయాలని ప్రిన్సిపాల్‌‌కు సూచించారు. అయినా పట్టించుకోకపోవడంతో ఎంఈవో, ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. వారు శనివారం గురుకులాన్ని సందర్శించి ప్రిన్సిపాల్‌‌కు పలు సూచనలు చేశారు. 

విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డిండి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌‌పై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్‌‌ఎఫ్‌‌ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎనమల్ల నవీన్‌‌ డిమాండ్‌‌ చేశారు. ఈ మేరకు శనివారం పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు. స్కూల్‌‌ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో 16 మంది స్టూడెంట్లను ఎలుకలు కరిచాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బాధ్యులపై ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని, లేదంటే ఏఐఎస్‌‌ఎఫ్‌‌, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్‌‌ఎఫ్‌‌ డివిజన్‌‌ అధ్యక్షుడు సూరిగి వినయ్, డివిజన్ సహాయ కార్యదర్శి ఎనిమల్ల సాయి, నాయకులు నూతనగంటి హనుమంతు, బి.వెంకటేశ్‌‌, బి.అరవింద్, శశి, అరుణ్ పాల్గొన్నారు.