
RBI Rate Cuts: గడచిన కొన్ని నెలలుగా దేశీయంగా ద్రవ్యోల్బణం అదుపులో ఉండటంతో పాటు వ-ృద్ధి రేటు మెరుగుపడిన వేళ రిజర్వు బ్యాంక్ తన తాజా మానిటరీ పాలసీలో కీలక వడ్డీ రేటు రెపో రేటును 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఎంపీసీ పాలసీ కమిటీ ఈ మేరకు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు రిజర్వు బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. దీంతో ప్రస్తుతం రెపో రేటు 5.5 శాతానికి తగ్గింది.
మార్కెట్లో నిపుణులు ఈసారి కూడా వడ్డీ రేట్లను రిజర్వు బ్యాంక్ తగ్గిస్తుందని అంచనా వేసినప్పటికీ 25 బేసిస్ పాయింట్ల తగ్గించవచ్చని భావించారు. కానీ ఆర్థిక వ్యవస్థ మెరుగైన స్థితిలో ఉండటంతో రిజర్వు బ్యాంక్ అధికారులు ఎక్కువ రేటు తగ్గింపును ప్రకటించారు.
వాస్తవానికి భారీ వడ్డీ రేటు తగ్గింపుకు రిజర్వు బ్యాంక్ వెళ్లటానికి కారణం దేశీయంగా తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం రిజర్వు బ్యాంక్ టార్గెట్ అయిన 4 శాతం లోపు ఉండటమే. అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇది 3.7 శాతం నుంచి 4 శాతం మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నట్లు మల్హోత్రా పేర్కొన్నారు.
ప్రస్తుతం వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం కారణంగా హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, కార్ లోన్ల రేట్లు భారీగా తగ్గనున్నాయి. అయితే మరోపక్క అధిక వడ్డీ రేట్లతో ఇప్పటి వరకు బ్యాంకుల్లో డబ్బు దాచుకున్న ప్రజలు ఆ ప్రయోజనాన్ని ఇకపై పొందలేరు. ఎందుకంటే తగ్గిన రెపో రేటుకు అనుగుణంగా దేశంలోని ప్రభుత్వ ప్రైవేటు యాజమాన్యంలోని బ్యాంకులు కూడా తమ టర్మ్ డిపాజిట్లపై అందించే వడ్డీ రేట్లను వివిధ కాలాలకు సర్థుబాటు చేస్తాయి.