అడ్డంగా దొరికిపోయిన RCB: తొక్కిసలాటకు కారణం వాళ్లే.. ఆధారాలు ఇదిగో..!

అడ్డంగా దొరికిపోయిన RCB: తొక్కిసలాటకు కారణం వాళ్లే.. ఆధారాలు ఇదిగో..!

బెంగళూరులోని చిన్న స్వామి క్రికెట్ స్టేడియం దగ్గర తొక్కిసలాటకు కారణం ఎవరు..? ఎవరిపై కేసు పెట్టాలి..? లక్షల మంది క్రికెట్ అభిమానులు పోటెత్తటానికి కారణం ఎవరు..? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికేసింది.. మొత్తం తొక్కిసలాటకు.. గందరగోళానికి కారణం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మేనేజ్మెంట్ అని ఆధారాలు బయటపడ్డాయి. వాస్తవానికి.. విధాన సౌధ నుంచి చిన స్వామి స్టేడియం వరకూ విక్టరీ పరేడ్ నిర్వహించడానికి పోలీసులు అనుమతి నిరాకరించారు.

అయినప్పటికీ పోలీసులు అనుమతి నిరాకరించిన విషయాన్ని బేఖాతరు చేస్తూ.. ఆర్సీబీ తమ ‘ఎక్స్’ ఖాతాలో సాయంత్రం 5 గంటల నుంచి ఆర్సీబీ విక్టరీ పరేడ్ ఉంటుందని పోస్ట్ చేయడంతో అభిమానులు భారీగా విధాన సభ దగ్గరకు, చిన స్వామి స్టేడియం దగ్గరకు చేరుకున్నారు. పరిమిత సంఖ్యలో ఫ్రీ పాసులు ఉన్నాయని కూడా ఆర్సీబీనే తమ ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది.

ఈ ట్వీట్ చూసిన అభిమానులు పరేడ్ జరుగుతుందని.. పరేడ్ దగ్గర చూడలేకపోయినా చిన స్వామి స్టేడియం దగ్గర ఎదురుచూస్తే అక్కడైనా తమ అభిమాన క్రికెటర్లను చూడొచ్చని స్టేడియం దగ్గరకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇలా.. ఆర్సీబీ కూడా ఈ తొక్కిసలాటకు పరోక్షంగా కారణమైంది. అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని, ఒక కిలో మీటర్ వరకూ ఆ జనసందోహాన్ని నియంత్రించడం పెద్ద ఛాలెంజ్ అని పోలీసులు పరేడ్కు అనుమతి నిరాకరించారు. పార్కింగ్ సదుపాయం పరిమితంగా ఉన్నందు వల్ల విక్టరీ పరేడ్ లేదని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఈ తొక్కిసలాట ఘటన తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనన్న భయంతో ఆ పోస్ట్ను డిలీట్ చేశారు.

బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వద్ద బుధవారం జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. వేల మంది అభిమానులు గేటు బద్దలు కొట్టి స్టేడియం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఈ తొక్కిసలాట జరిగింది. మృతుల్లో ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఘటనలో 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిని దగ్గరలోని హాస్పిటల్స్కు తరలించి చికిత్స అందించారు. మృతుల ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్​గ్రేషియా ప్రకటించింది. గాయపడినవారందరూ కోలుకునే దాకా ఫ్రీగా ట్రీట్​మెంట్ ఇచ్చేందుకు నిర్ణయిచింది. ఆర్సీబీ కూడా చనిపోయిన బాధిత కుటుంబాలకు 10 లక్షల పరిహారం ప్రకటించింది.