ఐపీఎల్లో ఒక్కటే టైటిల్ నెగ్గినా ఐదుసార్లు విన్నర్లుగా నిలిచిన ముంబై, సీఎస్కేను మించిన పాపులారిటీ ఉన్న ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ). ట్రోఫీ లెక్కలతో సంబంధం లేకుండా దేశం నలుమూలలా.. ప్రపంచ వ్యాప్తంగా ఆర్సీబీ అంటే పడిచచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. మెగా లీగ్లో 18 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణ, పోరాటానికి తెరదించుతూ గతేడాది విజేతగా నిలిచిన ఆ జట్టు ఇప్పుడు డిఫెండింగ్ చాంపియన్ హోదాలో మరో టైటిల్ వేటకు సిద్ధమైంది.
విరాట్ కోహ్లీ చిరకాల నెరవేరిన వేళ.. అదే జోరుతో రెండో ట్రోఫీని ముద్దాడడమే లక్ష్యంగా ఆర్సీబీ బరిలోకి దిగుతోంది. మినీ వేలానికి ముందు లియామ్ లివింగ్స్టోన్, లుంగి ఎంగిడి వంటి స్టార్లను వదులుకున్న మేనేజ్మెంట్.. రూ.7 కోట్లు వెచ్చించి వెంకటేష్ అయ్యర్ను, అలాగే జాకబ్ డఫీ వంటి ప్రతిభావంతులను జట్టులోకి తెచ్చుకొని మరింత బలంగా మారింది.
రజత్ పాటిదార్ కెప్టెన్సీలోని జట్టు ఈ సీజన్లో తన హోమ్ మ్యాచ్లను రెండు వేదికల్లో ( బెంగళూరు, రాయ్పూర్) ఆడనుంది. విమెన్స్ ప్రీమియర్ లీగ్లో ఆర్సీబీ అమ్మాయిలు వరుసగా రెండోసారి టైటిల్ నెగ్గి డబుల్ ధమాకా మోగించారు. మరి ఐపీఎల్లో అబ్బాయిలు కూడా డబుల్ డిలైట్ సాధిస్తారేమో చూడాలి.
బలాలు..
ఆర్సీబీ ప్రధాన బలం బ్యాటింగ్ డెప్త్. ఐపీఎల్ చరిత్రలోనే టాప్ స్కోరర్ విరాట్ కోహ్లీ (8661), విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్ జోడీ ఇన్నింగ్స్ను ఆరంభించనుంది. మిడిల్ ఆర్డర్లో కెప్టెన్ రజత్ పాటిదార్కు తోడుగా రూ.7 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన వెంకటేష్ అయ్యర్ రాకతో బ్యాటింగ్ విభాగం మరింత బలోపేతమైంది. జితేష్ శర్మ, రొమారియో షెపర్డ్ వంటి పవర్ఫుల్ ఫినిషర్లు ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం.
టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో వీరోచిత సెంచరీతో అదరగొట్టిన ఇంగ్లండ్ స్టార్ జాకబ్ బెథెల్ కూడా అందుబాటులో ఉన్నాడు. హేజిల్వుడ్, భువనేశ్వర్ రూపంలో నాణ్యమైన పేసర్లు, స్పిన్తో మ్యాజిక్ చేయడంతో పాటు బ్యాట్తోనూ మెప్పించే క్రునాల్ పాండ్యా వంటి నాణ్యమైన ఆల్రౌండర్ ఆర్సీబీ సొంతం.
దాంతో గతంలో సీఎస్కే (2010, 2011), ముంబై (2019, 2020) సాధించినట్లుగా వరుసగా రెండోసారి టైటిల్ గెలిచి ‘బిగ్ త్రీ’ క్లబ్లో చేరే సువర్ణావకాశం ఇప్పుడు ఆర్సీబీ ముందుంది. టీమిండియాలో రీఎంట్రీ ఆశిస్తున్న వెంకటేష్ అయ్యర్కు ఇదొక గొప్ప వేదిక అనొచ్చు.
బలహీనతలు
పేస్ విభాగంలో సీనియర్ బౌలర్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. స్టార్ పేసర్ జోష్ హేజిల్వుడ్ గాయం కారణంగా టోర్నీ ఆరంభ మ్యాచులకు దూరం కానుండటంతో.. సీనియర్ భువనేశ్వర్ కుమార్ మీదనే భారం పడనుంది. వ్యక్తిగత కారణాలతో యశ్ దయాల్ సీజన్ మొత్తానికి దూరం అవ్వడం మరో ఎదురుదెబ్బ. స్పిన్ విభాగంలో క్రునాల్ పాండ్యా ప్రధాన బౌలర్ అయినప్పటికీ, అతనికి జతగా సుయాష్ శర్మ వంటి యువకులు అనుభవలేమితో తడబడితే ఇబ్బందులు తప్పవు.
టీమ్ ఎదుర్కొంటున్న మరో ప్రధాన ముప్పు గాయాలు. టిమ్ డేవిడ్ వంటి కీలక ఆటగాళ్ల పాత గాయాలు తిరగబెట్టినా లేదా ఫ్రంట్లైన్ బౌలర్లు ఫామ్ కోల్పోయినా ప్లే ఆఫ్స్ రేసు కష్టతరమవుతుంది. వేదికల మార్పు (రాయ్పూర్, బెంగళూరు) వల్ల పిచ్ పరిస్థితులకు వేగంగా అలవాటు పడకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.
ఇక, డిసెంబర్లో ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడిన భువనేశ్వర్, జనవరిలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో పాల్గొన్న కోహ్లీ నేరుగా ఐపీఎల్కు వచ్చారు. వాళ్లు టచ్లోకి వచ్చేందుకు టైమ్ తీసుకుంటే అది జట్టుపై ప్రభావం పడొచ్చు. డిఫెండింగ్ చాంపియన్గా అంచనాల భారం కూడా ప్రతికూలంగా మారొచ్చు.
ఆర్సీబీ టీమ్
రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, టిమ్ డేవిడ్, దేవదత్ పడిక్కల్, ఫిలిప్ సాల్ట్, జితేష్ శర్మ, జోర్డాన్ కాక్స్, వెంకటేష్ అయ్యర్, క్రునాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, మంగేష్ యాదవ్, జాకబ్ బెథెల్, సాత్విక్ దేశ్వాల్, విక్కీ ఓస్త్వాల్, కనిష్క్ చౌహాన్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్, యశ్ దయాల్, సుయాష్ శర్మ, జాకబ్ డఫీ, నువాన్ తుషార, రసిక్ దార్ సలామ్, స్వప్నిల్ సింగ్, విహాన్ మల్హోత్రా, అభినందన్ సింగ్.
