RCB vs SRH: డేంజర్ జోన్‌లో ఆర్సీబీ.. ప్లే ఆఫ్‌కు వెళ్లాలంటే అదొక్కటే మార్గం

RCB vs SRH: డేంజర్ జోన్‌లో ఆర్సీబీ.. ప్లే ఆఫ్‌కు వెళ్లాలంటే అదొక్కటే మార్గం

ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కష్టాల్లో పడింది. వరుస పరాజయాలతో ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆడిన 7 మ్యాచ్ ల్లో ఒకటే గెలిచి ఆరు మ్యాచ్ లు ఓడిపోయింది. దీంతో ఆర్సీబీ ప్లే ఆఫ్ రేస్ లో వెనకపడిపోయింది. నిన్న (ఏప్రిల్ 15) సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన కీలక మ్యాచ్ లో ఓడిపోవడంతో..ఆ జట్టు డేంజర్ జోన్ లో పడింది. అసలు ఆర్సీబీ ప్లే ఆఫ్ కు చేరే అవకాశం ఉందో లేదో ఇప్పుడు చూద్దాం. 

టోర్నీలో ఒక జట్టు 14 మ్యాచ్ లు చొప్పున ఆడుతుంది. ఒక జట్టు ప్లే ఆఫ్ కు అర్హత సాధించాలంటే కనీసం 8 మ్యాచ్ ల్లో విజయం సాధించడం తప్పనిసరి. ప్రస్తుతం ఆర్సీబీ ఏడు మ్యాచ్ ల్లో ఒకటే విజయం సాధించింది. నిన్న సన్ రైజర్స్ చేతిలో ఓడిపోవడంతో మిగిలిన 7 మ్యాచ్ ల్లో ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి. ఐపీఎల్ లో అన్ని బలమైన జట్లే. ప్రతి మ్యాచ్ లో విజయం సాధించాలంటే శక్తికి మించిన పని. దీంతో ఆర్సీబీ ప్లే ఆఫ్ కు చేరాలంటే అద్భుతం జరగాల్సిందే. 

7 మ్యాచ్ లు గెలిచినా ప్లే ఆఫ్ కు చేరే అవకాశం ఉంది. కానీ మిగిలిన జట్ల ఫలితాల పై ఆధారపడాల్సి ఉంది. ఇప్పటికే రాజస్థాన్, కేకేఆర్, చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు విజయాలతో ముందంజలో ఉన్నాయి. బెంగళూరు మినహాయిస్తే మిగిలిన జట్లన్నీ కనీసం రెండు మ్యాచ్ లు గెలిచాయి. మరి బెంగళూరు ఒక్క మ్యాచ్ లో కూడా ఓడిపోకుండా ప్లే ఆఫ్ కు అర్హత సాధిస్తుందో లేదో చూడాలి. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే టాస్‌‌‌‌ ఓడిన హైదరాబాద్‌‌‌‌ 20 ఓవర్లలో 287/4 స్కోరు చేసింది. ట్రావిస్‌‌‌‌ హెడ్‌‌‌‌ (41 బాల్స్‌‌‌‌లో 9 ఫోర్లు, 8  సిక్సర్లతో 102), హెన్రిచ్‌‌‌‌ క్లాసెన్‌‌‌‌ (31 బాల్స్‌‌‌‌లో 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 67), అబ్దుల్‌‌‌‌ సమద్‌‌‌‌ (10 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 3  సిక్సర్లతో 37 నాటౌట్‌‌‌‌)  వీర విహారం చేశారు. లక్ష్య ఛేదనలో బెంగళూరు 20 ఓవర్లలో 262/7 స్కోరుకే పరిమితమైంది. దినేశ్‌‌‌‌ కార్తీక్‌‌‌‌ (35 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 7  సిక్సర్లతో 83), డుప్లెసిస్‌‌‌‌ (28 బాల్స్‌‌‌‌లో 7 ఫోర్లు, 4  సిక్సర్లతో 62), కోహ్లీ (20 బాల్స్‌‌‌‌లో 6 ఫోర్లు, 2  సిక్సర్లతో 42) పోరాడినా ప్రయోజనం దక్కలేదు. హెడ్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది.