సిద్దిపేట, వెలుగు: రైతన్న సాగునీటి కష్టాలు తీర్చే కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ ప్రారంభానికి రెడీ అయ్యింది. సిద్దిపేట జిల్లాలో నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు యాదాద్రి భువనగిరి, మేడ్చల్ జిల్లాలకు సాగు నీరందనుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్ 4, ప్యాకేజీ 14లో భాగంగా సముద్ర మట్టానికి 510 మీటర్ల ఎత్తులో దాదాపు రూ.1,600 కోట్ల వ్యయంతో కొండ పోచమ్మ ప్రాజెక్టు చేపట్టారు. ఈ రిజర్వాయర్ నిర్మాణంతో ఐదు జిల్లాల పరిధిలోని 2.85 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు హైదరాబాద్ నగరానికి తాగునీటి సౌకర్యం కలుగుతుంది. ఈ రిజర్వాయర్తో గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని దాదాపు 26 వేల ఎకరాలకు సాగు నీటిని అందిస్తారు. రిజర్వాయర్ నిర్మాణానికి దాదాపు 4,700 ఎకరాలను సేకరించగా ములుగు మండలంలోని మామిడాల, బైలంపూర్, తానేదార్పల్లి గ్రామాలు పూర్తిగా ముంపునకు గురవుతున్నాయి.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో నీటి మళ్లింపు..
వాస్తవానికి రంగనాయక సాగర్ రిజర్వాయర్ నుంచి కొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్కు నీటిని తరలించి అక్కడి నుంచి 21.335 కిలో మీటర్ల గ్రావిటీ కెనాల్స్ ద్వారా కొండపోచమ్మకు నీటిని మళ్లించాల్సిఉంది. అయితే మల్లన్న సాగర్ రిజర్వాయర్ పనులు పూర్తి కాకపోవడంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో నీటి తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. రంగనాయక సాగర్ నుంచి టన్నెల్ ద్వారా తొగుట మండలం తుక్కాపూర్ వద్ద నిర్మించిన సర్జిపూల్కు గోదావరి జలాలను విడుదల చేశారు. ఇక్కడి నుంచి మల్లన్న సాగర్ రిజర్వాయర్ వద్ద నుంచి గజ్వేల్ మండలం అక్కారం వద్ద నిర్మించిన పంప్ హౌజ్లోకి.. ఆ తర్వాత మర్కుక్ వద్ద నిర్మించిన మరో పంప్ హౌజ్కు నీటిని తరలించిన తర్వాత కొండపొచమ్మ సాగర్ రిజర్వాయర్లోకి ఎత్తి పోయనున్నారు.
ఎనిమిది ప్రధాన కాల్వలు..
కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ 8 కిలో మీటర్ల మేర వలయాకారంలో నిర్మించారు. మూడు పాయింట్ల వద్ద నీటిని పంపింగ్ చేసేలా పంప్ హౌజ్లను ఏర్పాటు చేశారు. ఇవే కాకుండా ఐదు జిల్లాల పరిధిలోని గజ్వేల్, దుబ్బాక, భువనగిరి, నర్సాపూర్, మెదక్, సంగారెడ్డి, పటన్చెరు, మల్కాజిగిరి నియోజకవర్గాల్లోని 26 మండలాల్లోని గ్రామాలకు ఎనిమిది ప్రధాన కాల్వల (135 కిలో మీటర్లు) ద్వారా గోదావరి జలాలను మళ్లించనున్నారు. ఇందుకు ఇప్పటికే జగదేవ్పూర్, తుర్కపల్లి, ఎం తుర్కపల్లి, రామాయంపేట, గజ్వేల్, కిష్టాపూర్, శంకరంపేట, ఉప్పరపల్లి కాల్వలు రెడీ అయ్యాయి.
సీఎం చేతుల మీదుగా..
సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో కేవలం నాలుగేళ్లలోనే 15 టీఎంసీల సామర్థ్యంతో కొండ పోచమ్మ రిజర్వాయర్ను నిర్మించారు. ఈ రిజర్వాయర్ నిర్మాణంతో ముంపునకు గుతురవుతున్న మూడు గ్రామాల్లో భూనిర్వాసితులను ఇప్పటికే తరలించడంతో దాదాపుగా పనులు పూర్తయ్యాయి. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా నీటి పంపింగ్ చేయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కొండ పోచమ్మ రిజర్వాయర్ వివరాలు
సామర్థ్యం 15 టీఎంసీలు
అంచనా వ్యయం రూ.1,600 కోట్లు
సేకరించిన భూమి 4,636 ఎకరాలు
ముంపునకు గురయ్యే అటవీ భూమి 135.64 ఎకరాలు
సాగు విస్తీర్ణం 2.85 లక్షల ఎకరాలు
ప్రయోజనం పొందనున్న జిల్లాలు 5
ఫుల్ రిజర్వాయర్ లెవల్ 618.0 మీటర్లు
కట్ట పొడవు 15.80 కిలో మీటర్లు
కట్ట గరిష్ఠ ఎత్తు 300 అడుగులు
కట్ట వెడల్పు 100 అడుగులు
ముంపునకు గురవుతున్న గ్రామాలు (మామిడాల, బైలంపూర్, తానేదార్పల్లి)