
బ్రిటన్: ఐపీఎల్-2025 అత్యధిక పరుగుల వీరుడు సాయి సుదర్శన్ టెస్టుల్లో చెత్త రికార్డ్ నమోదు చేశాడు. టెస్ట్ అరంగ్రేట మ్యాచ్లోనే డకౌట్ అయిన బ్యాటర్ల జాబితాలో చేరాడు. తద్వారా 15 ఏళ్ల చెత్త రికార్డ్ను సాయి సుదర్శన్ బ్రేక్ చేశాడు. 15 సంవత్సరాల క్రితం టెస్ట్ అరంగ్రేట మ్యాచులోనే టీమిండియా బ్యాటర్ వృద్ధిమాన్ సాహా డకౌట్ అయ్యాడు. 2010లో నాగ్పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచులో టెస్ట్ అరంగ్రేటం చేసిన సాహా పరుగులేమి చేయకుండానే వెనుదిరిగాడు. 15 ఏళ్ల తర్వాత ఈ రికార్డును సాయి సుదర్శన్ బ్రేక్ చేశాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతోన్న టెస్ట్ మ్యాచులో అరంగ్రేటం చేసిన సాయి సుదర్శన్ డకౌట్ అయ్యాడు. కేవలం నాలుగు బంతులు మాత్రమే ఆడి ఒక్క పరుగు కూడా చేయకుండానే ఔట్ అయ్యాడు.
కేఎల్ రాహుల్ (42) ఔట్ అయిన తర్వాత మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగిన సాయి సుదర్శన్ ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ లెగ్ సైడ్ వేసిన బంతిని ఫ్లిక్ షాట్ ఆడబోయాడు. టైమింగ్ సరిగ్గా కుదరక షాట్ మిస్ అవ్వడంతో బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని వికెట్ కీపర్ చేతుల్లో పడింది. దూరంగా వెళ్తున్న బంతిని జెమీ స్మిత్ అద్భుతంగా డైవ్ చేసి పట్టుకోవడంతో సాయి సుదర్శన్ నిరాశగా క్రీజును వీడాడు. ఐపీఎల్లో ఇలాంటి ఫ్లిక్ షాట్స్ ఆడి పరుగులు రాబట్టిన సుదర్శన్కు టెస్టుల్లో మాత్రం వర్కౌట్ కాలేదు. రిస్కీ షాట్ కావడంతో సాధారణంగా టెస్టుల్లో ఫ్లిక్ షాట్స్ ఆడడానికి బ్యాటర్లు సాహసం చేయరు. కానీ సుదర్శన్ మాత్రం అరంగ్రేట మ్యాచులోనే ప్రయోగాలకు పోయి డకౌట్అయ్యాడు. రెండో ఇన్నింగ్స్లో ఆడకపోతే సుదర్శన్ రెండో టెస్టులో చోటు కోల్పోయే ప్రమాదం ఉంది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. కోహ్లీ, రోహిత్ వంటి సీనియర్ ప్లేయర్స్ లేకుండా తొలి టెస్ట్ ఆడుతోన్న యువ భారత జట్టు ఆకట్టుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ దిగిన భారత్కు ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్, కేఎల్ రాహుల్ అద్భుతమైన శుభారంభం అందించారు. ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ యంగ్ ఓపెనర్ జైశ్వాల్ (101) అద్భుత సెంచరీతో రాణించాడు. కేఎల్ రాహుల్ కూడా (42) ఆకట్టుకున్నాడు. భారత టెస్టు పగ్గాలు చేపట్టిన శుభమన్ గిల్ తొలి మ్యాచులో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ప్రస్తుతం హాఫ్ సెంచరీ (67 నాటౌట్)
పూర్తి చేసుకున్న గిల్.. రిషబ్ పంత్ (6)తో కలిసి జట్టును ముందుకు తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం భారత్ 57 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది.