చేవెళ్లలో రియల్టర్ ​దారుణ హత్య

చేవెళ్లలో రియల్టర్ ​దారుణ హత్య

     ఆర్థిక లావాదేవీలతో నరికి చంపిన బావమరిది

చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఓ రియల్టర్​దారుణ హత్యకు గురయ్యాడు. సొంత బావమరిదే గొడ్డలితో నరికి చంపాడు. కడమంచి నారాయణ్​దాస్ (48) చేవెళ్లలో రియల్​ఎస్టేట్​వ్యాపారి. మంగళవారం రాత్రి 8 గంటలకు మేనత్త కొడుకైన తూర్పటి భాస్కర్(42) తో కలిసి ఊరెళ్ల గ్రామ సమీపంలోని తన పొలం వద్దకు వెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలిసి మద్యం తాగారు.

ఈ క్రమంలో భూవ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలపై వాగ్వాదం జరిగింది. మాటామాట పెరిగి భాస్కర్ గొడ్డలితో నారాయణ్​దాస్ ను నరికి చంపాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్​కు చేరుకొని డెడ్​బాడీని ఉస్మానియా హాస్పిటల్​కు తరలించారు. నిందితుడు భాస్కర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు చేవెళ్ల సీఐ లక్ష్మారెడ్డి తెలిపారు.

హత్యపై పలు అనుమానాలు 

నారాయణ్​దాస్​మర్డర్​పై బంధువులు, కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హత్య వెనుక భాస్కర్ తోపాటు మరికొందరు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. భాస్కర్​ఎప్పుడూ నారాయణ్​దాస్​వెంటే ఉంటాడని, అతను చంపేశాడంటే నమ్మశక్యంగా లేదని బంధువులు చెప్తున్నారు. భాస్కర్​కు ఎవరైనా సుపారీ ఇచ్చి చంపించి ఉంటారని భావిస్తున్నారు. అయితే భాస్కర్, నారాయణ్​దాస్​మధ్య ఆర్థిక లావాదేవీల్లో గొడవలు ఉన్నాయని, భాస్కర్​కు దాదాపు రూ.25లక్షలు ఇవ్వాలని తెలుస్తోంది.

దీంతో పోలీసులు వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలు ఉన్నాయనే విషయంపై ఆరా తీస్తున్నారు. కాగా, నారాయణ్​దాస్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య మణెమ్మ గవర్నమెంట్​టీచర్​గా పనిచేస్తున్నారు. నారాయణ్​దాస్ గతంలో  జర్నలిస్ట్​గా పనిచేశాడు. అంబేద్కరిస్ట్​గా స్థానికంగా పేరుంది. తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్(టఫ్)లోనూ కీలకంగా పనిచేశాడు.