
- ధాన్యం విలువ రూ.3,249.34 కోట్లు
- జగిత్యాల జిల్లాలో అత్యధికంగా 4.41 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు
కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ యాసంగి సీజన్ లో రికార్డు స్థాయిలో వడ్ల కొనుగోళ్లు జరిగాయి. పీఏసీఎస్, ఐకేపీ, డీసీఎంఎస్, హాకా ఆధ్వర్యంలోని కొనుగోలు సెంటర్ల ద్వారా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2,30,850 మంది రైతుల నుంచి 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు.
యాసంగి వడ్ల కొనుగోళ్లు పూర్తి కావడంతో సెంటర్లను మూసివేశారు. ఈ సీజన్ లో జగిత్యాల జిల్లాలో అత్యధికంగా రికార్డు స్థాయిలో రూ.1,023 కోట్ల విలువైన 4,41,350 మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నారు. వడ్లు అమ్మిన రైతుల్లో 98 శాతం మంది ఖాతాల్లో పైసలు జమ అయినట్లు అధికారులు వెల్లడించారు. సన్న వడ్లకు చెల్లించాల్సిన బోనస్ పైసలు మాత్రం పెండింగ్ లో ఉన్నాయి.
కరీంనగర్లో జోరుగా కొనుగోళ్లు
కరీంనగర్ జిల్లాలో ఈ సీజన్లో 2,66,896 ఎకరాల్లో వరి సాగు కాగా 5,86,723 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ఆఫీసర్లు అంచనా వేశారు. ఇందులో నుంచి ఈ సీజన్ లో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్కు వస్తుందని భావించి జిల్లావ్యాప్తంగా 325 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. నెలన్నరపాటు 3,08,860 మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేశారు. ఇందులో 2,75,698 మెట్రిక్ టన్నులు, దొడ్డు రకం కాగా, 33,162 మె.ట. సన్నరకం ఉన్నాయి. ఈ సీజన్లో 52,062 మంది రైతుల నుంచి రూ. 716.53 కోట్లు విలువ చేసే 3,08,860 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. ఇప్పటికే 50,905 మంది రైతుల ఖాతాల్లో రూ.700.75 కోట్లు జమ చేశారు.
అత్యధికంగా జగిత్యాలలో వడ్ల సేకరణ..
జగిత్యాల జిల్లాలో 428 కొనుగోలు కేంద్రాల ద్వారా రూ.1,023 కోట్ల విలువైన 4,41,350 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఇందులో దొడ్డు రకం 4,38,123 మెట్రిక్ టన్నులు, సన్న రకం 3,226 మెట్రిక్ టన్నుల సన్నరకం ఉంది. 80,603 మంది రైతులు కేంద్రాల్లో ధాన్యం అమ్మారు. ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో రూ.902.43 కోట్లను జమ చేశారు.
పెద్దపల్లి జిల్లాలో..
పెద్దపల్లి జిల్లాలో 315 కొనుగోలు కేంద్రాల ద్వారా రికార్డు స్థాయిలో 60,020 మంది రైతుల నుంచి 3,98,006 మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నారు. వీటి విలువ రూ.918.75 కోట్లు కాగా.. 95 శాతం మంది రైతుల ఖాతాల్లో రూ.871.2 కోట్లు జమచేశారు. కొనుగోలు చేసిన వడ్లలో దొడ్డు రకం 3,20,244 మెట్రిక్ టన్నులు, సన్న రకం 77,761 టన్నులు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 242 కొనుగోలు కేంద్రాల ద్వారా రికార్డు స్థాయిలో 38,165 మంది రైతుల నుంచి 2,54,930.750 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. రూ. 591.44 కోట్ల విలువైన వడ్లు కొనుగోలు చేయగా.. ఇందులో 35,707 మంది రైతుల ఖాతాల్లో వడ్ల పైసలు రూ. 478.71 కోట్లు జమ చేశారు. కొనుగోలు చేసిన వడ్లలో దొడ్డు రకం 2,46,937.420 మెట్రిక్ టన్నులు, సన్న రకం 7993.330 టన్నులుగా ఉంది. రైతులకు సన్నరకం వడ్లకు సంబంధించి రూ.3.99 కోట్ల బోనస్ డబ్బులు చెల్లించాల్సి ఉంది.
రూ.61.07 కోట్ల బోనస్ పెండింగ్ లో..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 12,21,425 క్వింటాళ్ల సన్న రకం వడ్లకు సంబంధించి రూ.61.07 కోట్ల బోనస్ డబ్బులు పెండింగ్ లో ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో 3,31,622 క్వింటాళ్ల సన్నరకం వడ్లకు రూ.16.58 కోట్లు బోనస్పైసలు రైతుల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. పెద్దపల్లి జిల్లాలో 7,77,610 క్వింటాళ్ల సన్నరకం వడ్లకు రూ.38.88 కోట్లు, జగిత్యాల జిల్లాలో 32,260 క్వింటాళ్లకు సంబంధించి రూ.1.61 కోట్లు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 79,933 క్వింటాళ్ల సన్నరకం వడ్లకు రూ.3.99 కోట్ల బోనస్ డబ్బులు రైతులకు చెల్లించాల్సి ఉంది.