- ఆరు శాతం పెరిగిన హైరింగ్
న్యూఢిల్లీ: చాలా ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నా, జాబ్ మార్కెట్లో సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ ప్రకారం, ఈ ఏడాది ఫిబ్రవరిలో నియామకాలు గత ఏడాదితో పోలిస్తే 12 శాతం పెరిగాయి. ముఖ్యంగా ఐటీ రంగం మళ్లీ పుంజుకుంటోంది.
ఈ రంగంలో నియామకాలు ఆరు శాతం, ఫ్రెషర్ల హైరింగ్ ఎనిమిది శాతం పెరిగింది. ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి నూతన సాంకేతిక విభాగాల్లో ఉద్యోగాలకు డిమాండ్40 శాతం పెరిగింది. భారతీయ కార్పొరేట్ కంపెనీలు నియామకాల్లో 55 శాతం వృద్ధితో ముందున్నాయి. ఇన్సూరెన్స్ రంగం 28 శాతం, బీపీఓ 22 శాతం, రియల్ ఎస్టేట్ 19 శాతం వృద్ధిని సాధించాయి.
ఏడాదికి రూ.20 లక్షల కంటే ఎక్కువ జీతం ఉన్న విభాగాల్లో నియామకాలు 23 శాతం పెరగడం గమనార్హం. నైపుణ్యం ఉన్న అభ్యర్థుల కోసం కంపెనీల మధ్య గట్టి పోటీ నెలకొందని నౌకరీ రిపోర్ట్ తెలిపింది.
