మనుషులా.. రాక్షసులా.. : దొంగతనం చేశాడని.. అక్కడ గొడ్డు కారంతో..

మనుషులా.. రాక్షసులా.. : దొంగతనం చేశాడని.. అక్కడ గొడ్డు కారంతో..

గ్రేటర్ నోయిడాలో దొంగతనం చేశారనే అనుమానంతో ఇద్దరు మైనర్ బాలురను అమానవీయంగా శిక్షిస్తున్నట్లు కనిపిస్తోన్న ఓ బాధాకరమైన వీడియో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కెమెరాకు చిక్కడంతో ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. జనం వారి చేతులు కట్టేసి, వారి ప్రైవేట్ పార్ట్స్‌లో ఎర్ర కారం కొట్టినట్లు పలు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ వైరల్ క్లిప్ లో తాడుతో వారి చేతులు కట్టేసి దారుణంగా కొట్టడం చూడవచ్చు.

దొంగిలించిన బైక్‌తో..

గ్రేటర్ నోయిడాలోని జేవార్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది, అక్కడ ఇద్దరు బాలురు దొంగతనానికి పాల్పడ్డారని అనుమానించిన జనం వారిని దారుణంగా కొట్టారు. ఈ ప్రాంతంలో దొంగిలించిన బైక్‌తో అబ్బాయిలను పట్టుకున్నట్లు సమాచారం. దీంతో వారు ఈ అమానవీయమైన చర్యకు పూనుకున్నారు. అంతే కాదు సంఘటనను కెమెరాల్లోనూ చిత్రీకరించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లోనే ఈ న్యూస్ వైరల్ అయింది.

జనం అబ్బాయిలకు తాలిబాన్ల తరహాలో శిక్ష వేస్తోన్న ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవడంతో.. సోషల్ మీడియా యూజర్స్ అక్కడి వారి అమానవీయ చర్యపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే నిందితులు మోహర్‌పాల్, ఉత్తమ్ కుమార్, విశాల్ తదితరులపై బాధిత కుటుంబీకులు కేసు నమోదు చేశారు. దొంగతనం చేశారనే అనుమానంతో జనం కొట్టిన అబ్బాయిలను జైలుకు తరలించినట్లు సమాచారం. ఈ ఘటనపై జేవార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. పోలీసులు సత్వరమే చర్యలు తీసుకున్నారు. సంఘటనతో సంబంధం ఉన్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసే ప్రక్రియలో ఉన్నారు.