పంచాయతీ రాజ్​లో 65 మందిని రెగ్యులరైజ్​ చేస్తూ జీవో 

పంచాయతీ రాజ్​లో 65 మందిని రెగ్యులరైజ్​ చేస్తూ జీవో 

హైదరాబాద్, వెలుగు: కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ మొదలైంది. శాఖల వారీగా వస్తున్న వివరాలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతోంది. అందుకు అనుగుణంగా సంబంధిత డిపార్ట్​మెంట్లు రెగ్యులరైజేషన్ ఉత్తర్వులు జారీ చేస్తున్నాయి. ఇటీవల పంచాయతీరాజ్​ అండ్​ రూరల్​డెవలప్​మెంట్​ డిపార్ట్​మెంట్​లో 65 మంది ఎన్ఎంఆర్​ ఉద్యోగులను రెగ్యులరైజ్​ చేస్తూ సెక్రటరీ సందీప్​ కుమార్​ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. 2016లో ఇచ్చిన జీవో నెంబర్​ 16 ఆధారంగా కాంట్రాక్టు ఎంప్లాయీస్​ను​ రెగ్యులరైజేషన్​ చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీరంతా పంచాయతీరాజ్​ ఇంజనీరింగ్​ విభాగం శాంక్షన్డ్​ పోస్టుల్లో పనిచేస్తున్నారు. రెగ్యులరైన వాటిల్లో జూనియర్​ టెక్నికల్​ఆఫీసర్లు, టెక్నికల్​అసిస్టెంట్, టైపిస్ట్, ఆఫీస్​సబార్డినేట్లు, వాచ్​మెన్​ కమ్​స్వీపర్​ పోస్టులున్నాయి. వాస్తవానికి 70 మంది కాంట్రాక్టు ఎంప్లాయీస్​ను రెగ్యులర్​ చేయాలని ఫైనాన్స్ డిపార్ట్​మెంట్​కు ప్రపోజల్​ పంపగా అందులో అర్హత ఉన్న  65 మందికే అనుమతి లభించింది. ఇక సీఎం కేసీఆర్​ రెగ్యులరైజ్​ చేస్తామన్న 11,103 పోస్టుల్లో ఎక్కువగా ఎడ్యుకేషన్, హెల్త్​ డిపార్ట్​మెంట్లలోనే ఉన్నాయి. హెల్త్​లో స్టాఫ్​ నర్సులు, ఎడ్యుకేషన్​లో ఇంటర్మీడియెట్, డిగ్రీ ప్రభుత్వ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు ఉన్నారు. ఈ రెండింటిలోనే 9 వేల మంది దాకా ఉన్నట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. అయితే వీటి వివరాలు ఇంకా ఆర్థిక శాఖకు అందలేదు.

శాంక్షన్డ్​ పోస్టులో ఉంటేనే రెగ్యులరైజ్​

2016లో జారీ చేసిన జీఓ ప్రకారమే రెగ్యులరైజేషన్​ ఉత్తర్వులు ఇస్తున్నారు. దీని ప్రకారం శాంక్షన్డ్​ పోస్టులో ఉండి,  రోస్టర్​ పాయింట్, రూల్​ ఆఫ్​ రిజర్వేషన్​ వంటివి ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులనే రెగ్యులర్​ చేస్తున్నారు. శాంక్షన్డ్​ పోస్టులో పనిచేయకుంటే వారిని అనర్హులుగా గుర్తిస్తున్నారు.  ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వారినే రెగ్యులరైజేషన్​ చేయనున్నారు. గ్రాంట్​ఇన్​ఎయిడ్​ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు​ ఉద్యోగుల వివరాలూ ఫైనాన్స్​ డిపార్ట్​మెంట్​కు అందుతున్నాయి. దాదాపు రెండు వేల మంది ఉద్యోగుల వివరాలు ఫైనాన్స్​ డిపార్ట్​మెంట్​కు అందినట్లు తెలిసింది.