హైదరాబాద్, వెలుగు: కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మొత్తం 40 విభాగాల్లో 5,544 కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ ఆర్థికశాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు ఆదివారం జీవో రిలీజ్ చేశారు. ఇందులో జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో పని చేస్తున్న జూనియర్, సీనియర్ ఇన్స్ట్రక్టర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, లేబర్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ట్రెయినింగ్ ఆఫీసర్లు ఉన్నారు.
2022 మార్చిలోనే 11,103 పోస్టుల్లోని కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే ఇంకా సగం మందికి సంబంధించిన జీవోలు రాలేదు. ఏప్రిల్ నుంచి కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ అమలులో మాత్రం వెనకబడింది.