సీఎం కేసీఆర్‌‌కు బండి సంజయ్ లేఖ

సీఎం కేసీఆర్‌‌కు బండి సంజయ్ లేఖ

రూ. 4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌‌మెంట్ విడుదల చేయాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 14 లక్షల మంది విద్యార్థులు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఈ మేరకు సోమవారం సీఎం కేసీఆర్ కు ఆయన లేఖ రాశారు. గత రెండు సంవత్సరాలుగా 4 వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈబీసీ విద్యార్థులకు విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్భాటపు ప్రచారం, వివిధ పత్రికలు, మీడియాలో ప్రకటనలు ఇచ్చుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ.. బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ కు మాత్రం నిధులు కేటాయించడం లేదని లేఖలో ప్రస్తావించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంక్షేమం పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని విమర్శించారు. నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఫీజులు కట్టాలని ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు విద్యార్థలపై ఒత్తిడి తెస్తున్నారని వెల్లడించారు.

ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంటెక్, ఎంసీఏ, పీజీ, డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదని, మొత్తం ఫీజులు కట్టిన తర్వాతే..  ఆ సర్టిఫికేట్లు ఇస్తామంటున్నారని వెల్లడించారు. రెండు, మూడో సంవత్సరం విద్యార్థులకు కూడా ఫీజులు కట్టాలని వత్తిడి తెస్తున్నారని విమర్శించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. దీని కారణంగా విద్యార్థుల చదువు దెబ్బతింటోందని, పేద విద్యార్థులతో పాటు.. రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు కూడా ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. అనేక ప్రైవేటు విద్యా సంస్థల్లో బోధనా సిబ్బందికి వేతనాలు చెల్లించని పక్షంలో వారు నాణ్యమైన విద్యను ఏ విధంగా అందించగలరని లేఖలో ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రూ. 4వేల కోట్లను బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను విడుదల చేయాలని లేఖలో మరోసారి డిమాండ్ చేశారు బండి సంజయ్.
 

మరిన్ని వార్తల కోసం : -

పేదలు బతకడానికి, ప్రశ్నించడానికి అవకాశం లేదా?


బీజేపీ ఆఫీసు ముట్టడికి ప్రయత్నించిన NSUI