
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)కు హైకోర్టులో ఊరట లభించింది. ఆర్థికపరమైన పరిపాలనా నిర్ణయాలు తీసుకోవద్దని సింగిల్ జడ్జి జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులపై హైకోర్టు డివిజన్ బెంచ్ బుధవారం స్టే విధించింది. హెచ్సీఏలో జరిగిన ఆర్థిక అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ గతంలో హైకోర్టును ఆశ్రయించింది.
ఈ కేసు విచారణలో భాగంగా ఏప్రిల్ 21న సింగిల్ జడ్జి హెచ్సీఏ తమ సిబ్బంది వేతనాలు, రోజువారీ ఖర్చులు మినహా ఇతర ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దని ఆదేశించారు.దీనిపై హెచ్సీఏ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ను యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ రేణుక యారా డివిజన్ బెంచ్ విచారించి స్టే ఆదేశాలు వెలువరించింది.
పిటిషనలో లేని అంశాల జోలికి వెళ్లి సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చారని తప్పుపట్టింది. అప్పీల్లోని ప్రతివాదులకు నోటీసులు ఇచ్చి విచారణను జూన్ నెలకు వాయిదా వేసింది.