రేమిడిసివర్ బ్లాక్ దందా.. హెటిరో మేనేజర్, మరో వ్యక్తి అరెస్ట్

రేమిడిసివర్ బ్లాక్ దందా.. హెటిరో మేనేజర్, మరో  వ్యక్తి అరెస్ట్

నల్గొండ జిల్లా : తీవ్ర కొరత ఉన్న రేమిడిసివర్ ఇంజెక్షన్ల బ్లాక్ మార్కెట్ దందా గుట్టును నల్లగొండ జిల్లా పోలీసులు ఛేదించారు. మిర్యాలగూడ కేంద్రంగా శ్రీ సూర్యా ఆసుపత్రి అడ్డాగా సాగుతున్న వ్యాపారానికి బ్రేక్ వేశారు జిల్లా పోలీసులు. దీనికి సంబంధించిన వివరాలను సోమ‌వారం డిఐజి రంగనాధ్ తెలియజేశారు. నల్గొండ‌ జిల్లా, మిర్యాలగూడ పట్టణంలోని శ్రీ సూర్యా ఆసుపత్రిపై రెండు రోజుల క్రితం దాడులు చేసిన పోలీసులు.. భారీ సంఖ్యలో రేమిడిసివర్ ఇంజెక్షన్లను సీజ్ చేశారు. పోలీసులు అసలు ఎక్కడి నుండి తీసుకువస్తున్నారనే కోణంలో విచారణ చేసి బ్లాక్ దందాకు అడ్డుకట్ట వేశారు. మిర్యాలగూడకు చెందిన బాలకృష్ణ హైదరాబాద్ హెటిరో కంపెనీలో మేనేజర్ గా పని చేస్తున్నాడు. అయితే అతని చిన్ననాటి స్నేహితుడు మిర్యాలగూడ పరిధిలోని శాఖపాలెంకు చెందిన గణపతి రెడ్డి క్యూ ల్యాబ్ పేరుతో హైదరాబాద్ లో వ్యాపారం నిర్వహిస్తున్నట్లు రంగనాధ్ చెప్పారు. హెటిరో కంపెనీ మేనేజర్ గా పని చేస్తున్న బాలకృష్ణ.. హైదరాబాద్, ఉప్పల్ ప్రాంతానికి చెందిన శ్రీ లక్ష్మీ ఏజెన్సిస్ కు 3,000 రూపాయలకు ఒక బాటిల్ చొప్పున  సరఫరా చేస్తున్నాడు. అక్కడి నుండి అతని స్నేహితుడు బాలకృష్ణ ఒక్కో బాటిల్ కు 8,000 రూపాయలు చెల్లించి, కొనుగోలు చేసి వాటిని మిర్యాలగూడ పట్టణానికి చెందిన శ్రీ సూర్యా ఆసుపత్రి డాక్టర్ అశోక్ కుమార్ కు ఒక్కో బాటిల్ 23,000 వేల రూపాయలకు గణపతి రెడ్డి నుండి కొనుగోలు చేసేవారని తెలిపారు. శ్రీ సూర్యా ఆసుపత్రి పిఆర్వోగా ఉన్న శ్రీనివాస్ వీటిని హైదరాబాద్ నుండి తీసుకువచ్చే వాడని ..ఆ తర్వాత తమ ఆసుపత్రిలో కరోనా చికిత్స కోసం జాయిన్ అయ్యే పేషేంట్ల పరిస్థితి, వారి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఒక్కో బాటిల్ 35,000 రూపాయల నుండి 50,000 వరకు విక్రయించారని చెప్పారు. ఇప్పటి వరకు మొత్తం 138 బాటిల్స్ శ్రీ సూర్యా ఆసుపత్రికి గణపతి రెడ్డి ద్వారా సరఫరా జరిగిందని వివరించారు. ఈ కేసులో రెండు రోజుల క్రితం శ్రీ సూర్యా ఆసుపత్రి డాక్టర్ అశోక్ కుమార్ తో పాటు.. మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించగా.. సోమవారం రోజున హెటిరో మేనేజర్ బాలకృష్ణ, అతని స్నేహితుడు గణపతి రెడ్డిలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని తెలిపారు డీఐజీ రంగనాధ్. ఈ కేసులో సమర్ధవంతంగా పని చేసిన మిర్యాలగూడ డిఎస్పీ వెంకటేశ్వర్ రావు, టాస్క్ ఫోర్స్ సిఐలు ఎస్.ఎం. బాషా, బాలగోపాల్, మిర్యాలగూడ వన్ టౌన్ సిఐ సదా నాగరాజు, వన్ టౌన్ సిబ్బందిని డీఐజీ రంగనాధ్ ప్రత్యేకంగా అభినందించారు.