కార్తీకమాసం చివరి సోమవారం ఇలా చేస్తే నాగ దోషం నుంచి విముక్తి...

కార్తీకమాసం చివరి సోమవారం ఇలా చేస్తే నాగ దోషం నుంచి విముక్తి...

హిందువులు జాతకాలు ఎక్కువుగా విశ్వసిస్తుంటారు.  ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా.. పెళ్లి అయిన చాలా రోజులకు సంతానం కలుగపోయినా.. పండితులను... జ్యోతిష్య నిపుణులను సంప్రదిస్తుంటారు .  అయితే కాలసర్పదోషంతో బాధపడేవారు కార్తీకమాసం చివరిసోమవారం ( 2023,డిసెంబర్​ 11) న కొన్ని పరిహారాలతో నాగదోషం నుంచి విముక్తి పొందవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.  అసలు కాల సర్ప దోషం అంటే ఏమిటి, ఈ దోషం ఉన్న వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి.. కార్తీక చివరి సోమవారం నాడు సాయంత్రం చేసే పూజల వల్ల నాగదోషం నుంచి ఎలా విముక్తి పొందాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

కాల సర్ప దోషంతో బాధపడుతున్నారో అలాంటి వారందరికీ ఈ పవిత్రమైన రోజున సాయంత్రం చేసే కొన్ని పరిహారాల వల్ల నాగదోషం తొలగిపోతుందని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 

​కాలసర్ప దోష లక్షణాలు..

 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఎవరి జాతకంలో అయితే కాలసర్ప దోషం ఉంటుందో వారిలో ఆత్మ విశ్వాసం సన్నగిల్లుతుంది. తరచుగా ఆరోగ్య సమస్యలు ఏర్పడుతుంటాయి. పేదరికం, ఉద్యోగ సమస్యలు, వ్యాపారంలో నష్టాలు, మానసిక ఒత్తిడి, ఆందోళనలు, మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక పరంగా, శారీరక పరంగా ఎల్లప్పుడూ సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.

శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజలు..

నాగ దోషం అనేది  జాతకాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎవరి జాతకంలో అయితే రాజయోగం రెండు లేదా దానికన్నా ఎక్కువగా ఉంటే వారిపై కాల సర్ప దోషం ప్రభావం తగ్గిపోతుంది. నాగ దోషాన్ని తగ్గించేందుకు చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరుని దేవాలయంలో రాహు, కేతువులకు  ( డిసెంబర్​ 11) ప్రత్యేక పూజలు చేయాలి.. అలాగే నాసిక్ లోని త్రయంబకేశ్వర్ ఆలయంలోనూ ప్రత్యేక పూజలు చేయాలి.

​ఈ మంత్రాలను జపించాలి..

నాగ దోషం నుంచి విముక్తి కావాలనుకునేవారు మహా మృత్యుంజయ మంత్రం, శ్రీ విష్ణు పంచాక్షరి మంత్రాలను పఠించాలి. కాల సర్ప దోషం నుంచి విముక్తి పొందడానికి మీ ఇంట్లో నెమలి ఈకలను ధరించిన క్రిష్ణుడి విగ్రహాన్ని లేదా ఫొటోను ఉంచి, తనను పూజిస్తూ ‘ఓం నమో భగవతే వాసు దేవాయ’ అనే మంత్రాన్ని క్రమం తప్పకుండా 108 సార్లు జపిస్తే కచ్చితంగా మంచి ఫలితాలొస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

​ఈశ్వరునికి రుద్రాభిషేకం..

నాగ దోషం నుంచి తప్పించుకోవడానికి కార్తీక మాసంలో వచ్చే చివరి సోమవారం రోజున పరమేశ్వరునికి కచ్చితంగా రుద్రాభిషేకం చేయాలని శాస్త్రాలలో పేర్కొనబడింది. అదే విధంగా నాగదేవతలను పూజించడం వల్ల ఈ దోషం తొలగిపోతుందని పండితులు చెబుతారు. అలాగే కొన్ని ప్రత్యేకమైన వెండి ఉంగరాలను ధరించాలి. ముఖ్యంగా గోమేధికం ధరించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని, ఉంగరాన్ని  ఎడమచేతి మధ్య వేలుకు ధరించాలని పండితులు చెబుతున్నారు.