ఈ ఏడాది చివరలో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ 2023 జరగనున్న సంగతి తెలిసిందే. దాయాధి దేశం పాకిస్తాన్ చేస్తున్న జాప్యం కారణంగా.. ఈ మెగా టోర్నీ షెడ్యూల్ వాయిదా పడుతూ వస్తోంది. అయితే.. జూన్ 27న ఈ టోర్నీ షెడ్యూల్ని ఐసీసీ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. జూన్ 27న ఉదయం గం. 11.30లకు ఐసీసీ ప్రెస్ మీట్ నిర్వహించి బిగ్ అనౌన్స్మెంట్ చేయనుందట.
అదే రోజు వరల్డ్ కప్లో పాల్గొనే జట్లు.. తమ పూర్తి వివరాలను ప్రకటించడానికి ఆగస్టు 29వ తేదీని డెడ్లైన్గా విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఆయా దేశాల క్రికెట్ బోర్డులు తమ జట్లను ఖారారు చేయడానికి, వాటి వివరాలు సమర్పించడానికి రెండు నెలల గడువు మాత్రమే మిగిలి ఉంటుంది. వీటితో పాటు ప్రపంచకప్ నిబంధనలపై కూడా అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మొత్తం పది జట్ల మధ్య తుది సమరం
మొత్తం పది జట్లు పాల్గొననున్న ఈ టోర్నీ అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి టీమిండియాతో పాటు పాకిస్థాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు నేరుగా అర్హత సాధించగా, మరో రెండు స్థానాల కోసం.. జింబాబ్వే వేదికగా క్వాలిఫయర్ టోర్నీ జరుగుతోంది. ఈ పోరులో ఫైనల్కు చేరిన జట్లు.. వన్డే ప్రపంచకప్కు అర్హత సాధిస్తాయి.