
Indian Railways: భారతదేశంలో ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్వర్క్ ప్రజలను నిరంతరం ప్రయాణించటానికి మార్గం కల్పిస్తోంది. సామాన్య ప్రజల నుంచి సంపన్నుల వరకు సుదూర ప్రయాణాల కోసం దీనిపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. తక్కువ ఖర్చులో ప్రయాణ సౌకర్యాన్ని అందించే రైల్వేలు త్వరలోనే ప్యాసింజర్లపై ఛార్జీల భారాన్ని వేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.
చాలా సంవత్సరాల తర్వాత భారతీయ రైల్వే సంస్థ ప్యాసింజర్ రైళ్ల ఛార్జీలను పెంచబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పెంచబడిన ఛార్జీలు జూలై 1 నుంచి అమలులోకి వస్తాయని సమాచారం. పెంపు విషయానికి వస్తే.. నాన్-ఏసీ మెయిల్/ఎక్స్ప్రెస్ రైళ్ల ప్రయాణీకుల ఛార్జీలు కిలోమీటరుకు 1 పైసా చొప్పున పెంచనుండగా.. ఏసీ క్లాస్ ఛార్జీలు కిలోమీటరుకు 2 పైసలు పెరగనున్నట్లు తేలింది.
►ALSO READ | Gautam Adani: ఆపరేషన్ సిందూర్లో అదానీ గ్రూప్ కీలక పాత్ర.. గాల్లోనే శత్రువుపై విధ్వంసం..
అలాగే 500 కిలోమీటర్ల ప్రయాణానికి సబర్బన్ టిక్కెట్లు, రెండవ తరగతి ప్రయాణానికి ఛార్జీల పెంపు ఉండదని తెలుస్తోంది. 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరాలకు ఛార్జీల పెంపు కిలోమీటరుకు సగం పైసా చొప్పున ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే నెలవారీ సీజనల్ టిక్కెట్ల విషయంలోనూ ఎలాంటి పెంపులు ఉండబోవని నివేదించబడింది. అయితే దీనిపై అధికారికంగా రైల్వే మంత్రిత్వ శాఖ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.